ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ కుండ బద్దలు కొట్టేశారు. భూగోళం ఉన్నంత వరకు అది అసంభవం అని తేల్చేశారు. సమ్మెకు ముగింపు ఆర్టీసీ ముగింపే అని, ఎవ్వరూ ఆ సంస్థను కాపాడలేరని బల్ల గుద్ది మరీ చెప్పేశారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో ఒక్కసారిగా అలజడి, ఆందోళన బయలుదేరింది.
కార్మికులు అమాయకులైతే వెంటనే దరఖాస్తు పెట్టుకుని జాయిన్ కావాలని కేసీఆర్ సూచించారు. దీంతో 20 రోజులుగా ఉధృతంగా సమ్మె చేస్తున్నవారంతా పునరాలోచనలో పడ్డారు. ఒకటి అనుకుంటే మరొకటి అయిందని మథనపడుతున్నారు. సంస్థ విలీనం కోసం ప్రయత్నిస్తే.. అసలుకే ఎసరొచ్చిందని ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు కార్మికుల ఆందోళన గమనించిన ఆర్టీసీ జేఏసీ వెంటనే అప్రమత్తమైంది. కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ధైర్యం చెప్పింది. హైకోర్టులో న్యాయం జరుగుతుందని పేర్కొంది. కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించాలని నిర్ణయించింది.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపుతో సమ్మెకు ప్రజా మద్దతు లేదని తేలిపోవడం ఆర్టీసీ జేఏసీని షాక్ కు గురి చేసింది. ఈ నేపథ్యంలో తమ సమ్మెకు ప్రజా మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. తొలుత విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపి, తమ బాధలు విన్నవించి సహకారం కోరాలని యోచిస్తోంది.
అయితే, సమ్మె ఇకపై ఉధృతంగా సాగే అవకాశం లేదని తెలుస్తోంది. పలువురు కార్మికులు ఇప్పటికే యూనియన్ నాయకుల వైఖరిని విమర్శిస్తున్నట్టు చెబుతున్నారు. డిమాండ్ల సాధన విషయంలో సర్కారుకు కాస్త సమయం ఇచ్చి, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు.
కీలకమైన దసరా పండగ సమయంలో సమ్మెకు వెళ్లడం ద్వారా ప్రజల మద్దతు కూడా పొందలేకపోయామని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని విధుల్లో చేరిపోవడమే బెటరనే భావనలో పలువురు ఉన్నట్టు సమాచారం. ఈ విషయంలో జేఏసీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.