నోట్ల రద్దు అంశంపై గత కొన్నిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. మార్చి, ఏప్రిల్ నాటికి పాత రూ.100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి తప్పించబోతున్నారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొంది. అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టంచేసింది. పాత నోట్ల రద్దు చేయడం అనేది కేవలం ఊహాగానాలే అని తేల్చి చెప్పింది. మార్చి లేదా ఏప్రిల్ నాటికి పాత వంద, పది, ఐదు రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకు భావిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.
ఆర్బీఐ ఏజీఎం మహేశ్ ఈ మేరకు ఓ సమావేశంలో ప్రకటన చేశారనే అంశం ప్రజల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అది నిజం కాదని పేర్కొంటూ ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వివరణ ఇచ్చింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని పేర్కొంది. మరోవైపు ఆర్బీఐ ప్రతినిధి కూడా ఈ వార్తలను ఖండించారు. ఆ నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన లేదని స్పష్టంచేశారు.