ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్( 80) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం 9:45 తుదిశ్వాస విడిచారు. ఈయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల. చంద్రమోహన్ (Chandramohan) కి భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ సినీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈయన మేనల్లుడే. 1966 లో ‘రంగులరాట్నం’ సినిమాతో చంద్రమోహన్ తెరంగేట్రం చేశారు. తెలుగు చిత్ర సీమలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన కథానాయకుడిగా 175, మొత్తంగా 935 సినిమాల్లో నటించారు.
కొత్త హీరోయిన్ల కి లక్కీ హీరోగా చంద్రమోహన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ దివంగత నటి శ్రీదేవి తొలి హీరో ఆయనే కావడం విశేషం. అలనాటి హీరోయిన్ జయప్రద నటించిన తొలి చిత్రం ‘సిరిసిరిమువ్వ’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలకు గాను ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2005 లో ‘అతనొక్కడే’ సినిమాలోని పాత్రకు గాను ‘నంది’ అవార్డు సొంతం చేసుకున్నారు.