Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మీద వైసీపీ నేతలంతా విరుచుకుపడుతున్నారు. అసలు చిరంజీవి ఏం అన్నారు.? అన్నది ఎవరికీ అనవసరం. గుడ్డెద్దు చేలోపడ్డట్టు.. అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు చిరంజీవి మీద. మంత్రులు కూడా కనీసపాటి జ్ఞానం, విజ్ఞత లేకుండా వ్యవహరిస్తుండడం గమనార్హం.
పార్లమెంటు వేదికగా సినీ నటుల రెమ్యునరేషన్ల గురించిన చర్చ ఎందుకు.? ప్రత్యేక హోదా గురించీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించీ, అభివృద్ధి గురించీ, ప్రాజెక్టుల గురించీ మాట్లాడండి.. అని మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో మాట్లాడారు. ‘సినీ పరిశ్రమని పిచ్చుకతో పోల్చుతూ, దానిపై రాజకీయం అనే బ్రహ్మాస్త్రం ఎందుకు.?’ అన్నది చిరంజీవి ప్రశ్న.
ఇది చిరంజీవి రెమ్యునరేషన్ గురించిన విషయం మాత్రమే కాదు. 100 కోట్లు ఆ పైన రెమ్యునరేషన్ని అందుకుంటున్న, అందుకోబోతున్న హీరోల గురించి రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న అక్కసుకి సంబంధించిన అంశం. టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ తరఫున కూడా చిరంజీవి మాట్లాడారు.
మరి, సినీ పరిశ్రమ తరఫున ఎవరూ ఎందుకు స్పందించడంలేదు.? పొద్దస్తమానం నీతులు చెప్పే తమ్మారెడ్డి భరద్వాజ నోరెందుకు పెగలడంలేదు.? ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, చేతులు కట్టుకుని దేబిరించారంటూ చిరంజీవి మీద గతంలో ఎగిరిన ఏబీఎన్ రాధాకృష్ణ, ఇప్పుడు చిరంజీవి ప్రదర్శించిన తెగువని ఎందుకు అభినందించడంలేదు.?
ప్రభాస్ మాట్లాడాలి.. మహేష్బాబు కూడా మాట్లాడాలి. రాజమౌళి కూడా పెదవి విప్పాలి.! ఎందుకంటే, చిరంజీవి వెంట, గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరిశ్రమ సమస్యలపై కలిసిన టీమ్లో వాళ్ళూ వున్నారు మరి. అలా వెళ్ళడాన్ని ‘అడుక్కోవడం’గా మంత్రి రోజా అభివర్ణించిన దరిమిలా, ప్రభాస్ కావొచ్చు.. మహేష్ కావొచ్చు.. స్పందించాలి కదా.?
నిర్మాతలు మాట్లాడాలి.. ఇతర నటీనటులూ స్పందించాలి. ఎవరూ స్పందించకపోయినా, చిరంజీవి తన బాధ్యతగా తాను స్పందిస్తూనే వుంటారు. పరిశ్రమకు చేతనైనంత మేలుని చేస్తూనే వుంటారు. అది ఆయన బాధ్యత అనుకుంటున్నారుగానీ, అదొక బలహీనత అనుకోవాలేమో.!