ఆ పిల్లాడికి నాట్యం అంటే ఇష్టం. కానీ అందరిలో కలవడానికి జంకు. పగలు జనాలు ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కూడా బెరుకే. కారణం.. అతడిలో ఆమె తాలూకు లక్షణాలు ఉండటమే. మధురై పట్టణం నిద్రపోయాక అతడి ప్రయాణం మొదలయ్యేది. స్నేహితుడితో కలిసి రైల్వే ట్రాక్స్, నిర్మానుష్యంగా ఉండే రోడ్లపైకి వెళ్లేవాడు. టూరింగ్ టాకీస్ లో నుంచి వినపడే పాటలకు అనుగుణంగా ఆ చీకట్లోనే నాట్యం చేసేవాడు. అలా అంచలంచెలుగా ఎదిగి ఏకంగా పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచాడు. అతడే నటరాజ్.. కాదు, ఆమెగా మారిన నర్తకీ నటరాజ్.
నటరాజ్ 1964లో తమిళనాడులోని మధురైలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి అతడికి నాట్యం అంటే మక్కువ ఎక్కువ. కానీ ఇంట్లో పరిస్థితులు అందుకు వ్యతిరేకం. దీంతో రాత్రివేళ స్నేహితుడితో కలిసి రోడ్లపై డ్యాన్స్ చేసేవాడు. క్రమంగా అతడిలో ఆమె లక్షణాలు కనిపించడంతో ఇంట్లోవారు ఛీదరించుకోవడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు అందరూ కూడా అతడిని దూరంగా పెట్టారు.
దీంతో 11 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి నటరాజ్ జీవితంలో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. కడుపు నింపుకోవడానికి చిన్నిచిన్న పనులు చేసేవాడు. ఆ సమయంలో నటరాజ్ స్నేహితుడు శక్తి అండగా నిలిచాడు. ఈ క్రమంలో ప్రముఖ నృత్యకారుడు తంజావూర్ కట్టప్ప పిళ్లై పరిచయం నటరాజ్ జీవితాన్ని మలుపు తిప్పింది. నటరాజ్ లోని నృత్య ప్రతిభను గుర్తించిన పిళ్లై.. అతడికి తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చి నాట్యంలో నిష్ణాతుడిని చేశారు. ఏకంగా 14 సంవత్సరాలపాటు అన్ని రకాల నృత్యరూపకాలు నేర్పించారు.
అంతేకాకుండా అతడిని ఆమెగా గుర్తించి నర్తకీ నటరాజ్ గా పేరు కూడా మార్చారు. ఇక అక్కడి నుంచి నర్తకి వెనుతిరిగి చూడలేదు. చిన్నగా మొదలైన ఆమె ప్రస్తానం ఏకంగా ప్రపంచస్థాయి వేదికలపై ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరింది. అక్కడితో ఆమె నాట్య ప్రయాణం ఆగిపోలేదు. తనలాగా నాట్యం నేర్చుకోవాలనే తపన ఉన్నవారి కోసం వల్లంబాలం ట్రస్ట్ ను నెలకొల్పి దాని ద్వారా శిక్షణ ఇస్తోంది. నాట్య రంగంలో ఆమె చేసిన సేవలకుగానూ ఎన్నో ప్రశంసలు అవార్డులు దక్కాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి ట్రాన్స్ జెండర్ నర్తకీ నటరాజ్ కావడం విశేషం.
‘’11 ఏళ్ల వయసులోనే నన్ను ఇంటినుంచి బయటకు గెంటేశారు. అప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను. రోజుకు కనీసం ఒకపూట కూడా తిండి దొరికేది కాదు. కడుపు నింపుకోవడం కోసం ఏ పని పడితే ఆ పని చేశాను. నానా ఇబ్బందులు పడి పాఠశాల చదువు పూర్తిచేశాను. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ నాట్యం పట్ల నాకున్న మక్కువ తగ్గలేదు’’ అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు నర్తకీ నటరాజ్.
హేమమాలిని, యామినీ కృష్ణమూర్తి, వైజయంతి మాల వంటి ప్రముఖులకు నాట్యం నేర్పిన పిళ్లైగారే తనకు గురువు కావడం నిజంగా తన అదృష్టమని పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్ అయిన తాను ఆ కారణంతో సానుభూతి పొందడానికి ఎన్నడూ ప్రయత్నించలేదన్నారు. ఇప్పుడు కూడా తనలోని నాట్యానికే పద్మశ్రీ పురస్కారం వచ్చిందని తెలిపారు. పద్మశ్రీ పురస్కారం వచ్చిన తర్వాత ఆమె మరింత బిజీ అయిపోయారు. త్వరలోనే ఆమె నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, కెనడా, ఇంగ్లండ్, అమెరికా తదితర దేశాల్లో సోలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. చీకట్లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం ప్రస్తుతం దేదీప్యమానంగా వెలుగుతోంది.
696775 104465hey there i stumbled upon your web site searching around the web. I wanted to tell you I enjoy the appear of points about here. Maintain it up will bookmark for certain. 351142