జగన్ బెయిల్ కాదు.. జగన్కి దక్కిన బెయిల్.! చంద్రబాబు బెయిల్ కాదు, చంద్రబాబుకి న్యాయస్థానం ఇచ్చిన బెయిల్.! ఇద్దరి బెయిల్ వ్యవహారాలకి సంబంధించి మెరిట్స్ భిన్నమైనవి.! ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు చాలా చాలా పెద్దది. దాంతో పోల్చితే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది జస్ట్ జుజుబి… చాలా చాలా చిన్నది.
కానీ, ప్రజాధనం నుంచి ఒక్క రూపాయిని అయినా ప్రజా ప్రతినిథులు, అందునా అధికారంలో వున్నోళ్ళు కొట్టేస్తే, అది క్షమించరాని నేరం. ఇలాంటి నేరాలు దేశంలో ప్రజా ప్రతినిథులు నిత్యం చేస్తూనే వుంటారు. వ్యవస్థల్లోని లోటుపాట్లని అడ్డంపెట్టుకుని, అమ్యామ్యాలు మింగుతూనే వుంటారన్నది బహిరంగ రహస్యం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఏళ్ళ తరబడి నడుస్తోంది. ఇంకోపక్క, పదేళ్ళుగా ఆయన బెయిల్ మీదనే వున్నారు. బెయిల్ మీదున్న జగన్, బెయిల్ మీద తాజాగా విడుదలైన చంద్రబాబు మీద బురద చల్లిస్తున్నారు వైసీపీ నేతల ద్వారా. ఇదీ రాజకీయం అంటే.!
ఇద్దరికీ అవినీతి బురద అంటుకుంటుంది. కడుక్కోవాల్సింది పోయి.. ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకుంటున్నారన్నమాట. ‘చంద్రబాబుకి వచ్చింది బెయిల్ మాత్రమే. ఆయన్ని నిర్దోషిగా కోర్టులు తేల్చలేదు..’ అంటూ వైసీపీ నేతలు అమాయకంగా మీడియా ముందు మాట్లాడేస్తున్నారు. మరి, వైఎస్ జగన్కి అక్రమాస్తుల కేసులో క్లీన్ చిట్ వచ్చిందా.?
అనారోగ్య సమస్యల్ని సాకుగా చూపి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారన్నది వైసీపీ ఆరోపణ. న్యాయస్థానం, బెయిల్ ఇచ్చిందంటే, చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలో పస వున్నట్టే కదా.? ప్రభుత్వం తరఫున ఎందుకు సమర్థవంతమైన వాదనలు వినిపించలేదు.?
మొత్తమ్మీద, చంద్రబాబు బెయిల్ వ్యవహారంలో వైసీపీ అతి వల్ల, రాష్ట్ర ప్రజలు.. ఈ బెయిల్ వ్యవహారాల గురించి లోతుగా చర్చించుకునే అవకాశం ఏర్పడుతోంది. వైసీపీ గురివింద నీతి ఇంకాస్త స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.