తెలంగాణలో ఏ రోజైనా కరోనా వైరస్ టెస్టుల సంఖ్య 25 వేలు దాటే అవకాశముందా.? ఇంకా నయ్యం.. 20 వేల టెస్టులు చేయడమే కనాకష్టంగా మారిపోయింది. 15 వేలకు అటూ ఇటూగా మాత్రమే సంఖ్య కన్పిస్తోంది. అది కూడా హైకోర్టు మొట్టికాయలేయడంతో 10 వేలు దాటిందిగానీ.. లేకపోతే ఐదారు వేలతో సరిపెట్టేదే తెలంగాణ ప్రభుత్వం. ఎందుకిలా.? ధనిక రాష్ట్రం తెలంగాణలో అవసరమైన మేర కరోనా టెస్టులు ఎందుకు జరగడంలేదు.? పైగా, చేసిన టెస్టులకు సంబంధించి ‘మీడియా బులెటిన్’ కూడా సరిగ్గా రావడంలేదాయె.
ఈ విషయమై ఒకటికి పదిసార్లు హైకోర్టు మొట్టికాయలేసినా ఫలితం కన్పించడంలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరోనా టెస్టుల్లో చాలా వేగం ప్రదర్శిస్తోంది. 50 వేల మార్క్ని కూడా టచ్ చేసింది. తమిళనాడు అయితే 60 వేల మార్క్ కూడా దాటేసింది రోజువారీ టెస్టుల్లో.
నిజానికి, భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న టెస్టులు చాలా చాలా తక్కువ. ఇంకా చాలా ఎక్కువ టెస్టులు జరగాల్సి వుంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రోజుకి 50 వేల నుంచి లక్ష టెస్టులు జరగాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుంటే, ప్రతిరోజూ సాయంత్రం విడుదల కావాల్సిన బులెటిన్ కాస్తా.. ఇప్పుడు ఉదయం వస్తోంది. అది కూడా నిన్నటి ఫలితాలు ఈ రోజు అన్న మాట. ఇదేం పద్ధతి.? హైకోర్టు మరింత సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో 50కి పైగా పేజీలతో కూడిన బులెటిన్ వచ్చింది. అయితే, ఆ బులెటిన్లో కొత్త విషయాలు ఏమీ లేవనే పెదవి విరుపులు ఆయా రాజకీయ పార్టీల నుంచి వ్యక్తమవుతున్నాయి.
మొదట్లో కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నట్లు కన్పించింది. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కరోనా టెస్టులు ఎక్కవ చేయించుకోవాలో తెలియక గ్రేటర్ పరిధిలోనే ప్రజలు ఆందోళన చెందుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎక్కడ లోపం జరుగుతోంది.? అధికారుల స్థాయిలోనా.? ప్రభుత్వ పెద్దల స్థాయిలోనా.? అన్నదే ఎవరికీ అర్థం కావడంలేదు. ‘మేం అత్యద్భుతంగా పనిచేస్తున్నాం.. అందుకే తెలంగాణలో కేసులు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తక్కువగా వున్నాయి.. మరణాల సంఖ్య కూడా తక్కువగా వుంది..’ అని మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్నారు. కానీ, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు మాత్రం దారుణంగా మారిపోతున్నాయన్నది నిర్వివాదాంశం.
ఇదిలా వుంటే, హైకోర్టులో తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితిపై విచారణ జరిగింది. కరోనా మరణాల్ని ప్రభుత్వం దాస్తోందంటూ వస్తున్న ఆరోపణలపైనా సంబంధిత శాఖల నుంచి నివేదిక కోరింది హైకోర్టు. కరోనా బులెటిన్లో తప్పులు లేకుండా చూడాలనీ, సమగ్ర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో వుంచాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోసారి సీఎస్ సహా ఉన్నతాధికారులు హైకోర్టులో విచారణకు హాజరు కావాల్సి వుంటుంది.