జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది సొల్లు పురాణమంటూ బులుగు మీడియా మొరుగుతోంది. ‘నేను మీకు భరోసా ఇస్తున్నా.. మీ పార్టీ అధినేత భార్య సహా.. వైసీపీ కార్యకర్తలు, నాయకుల ఇంట్లోని మహిళలెవర్నీ నేనుగానీ, నా పార్టీ కార్యకర్తలుగానీ, నా అభిమానులుగానీ తిట్టరు.. అలాగని నా పార్టీ కార్యకర్తలకు, అభిమనులకూ స్పష్టమైన ఆదేశాలిస్తున్నా..’ అని పవన్ కళ్యాణ్ చెప్పడం సొల్లు పురాణమైపోయింది.
ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా ఇలా చెప్పగలడా.? అయినా, పవన్ కళ్యాణ్ ప్రసంగంలో తప్పులు, సొల్లు అనేంతగా అర్థం పర్థం లేని విషయాలు బులుగు మీడియాకి ఏం కనిపించాయబ్బా.? వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు చంద్రబాబే కారణమని స్వయంగా వైఎస్ జగన్ ఆరోపించారు. ఇప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి. సో, చంద్రబాబుని తీసుకెళ్ళి లోపలెయ్యొచ్చు కదా.? అలా ఎందుకు చెయ్యడంలేదని ప్రశ్నిస్తే అది సొల్లు పురాణమెలా అవుతుంది.?
ఓ సామాజిక వర్గానికి మాత్రమే అధికారమా.? ఓ సామాజిక వర్గానికి మాత్రమే కీలక పదవుల్లో ప్రాధాన్యతా.? అని ప్రశ్నిస్తే అది సొల్లు పురాణమా.? అవును మరి, ఆ సామాజిక వర్గానికి చెందడం వల్లనే బులుగు మీడియాలో చాలావరకు ‘అవకాశాలు’ ప్రభుత్వం నుంచి పొందుతున్నారు మరి. సో, వాళ్ళకి పవన్ సంధించే ప్రతి ప్రశ్నా సొల్లు పురాణంలానే కనిపిస్తుంది.
దేవాలయాల మీద దాడులు జరగడం అత్యంత హేయం.. దీన్ని ప్రశ్నిస్తే సొల్లు పురాణమని అంటున్న బులుగు మీడియాకి అసలు సెక్యులరిజం అంటే ఏంటో తెలుసో లేదో మరి.! సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో వున్నాయ్.? టిక్కెట్ల ధరలు మీరెంత నిర్ణయించుకున్నా నాకేంటి నష్టం.? అని ప్రశ్నిస్తే అది సొల్లు పురాణంలా కనిపించింది బులుగు మీడియాకి. నిజమే కదా, రాష్ట్రంలో సినిమా థియేటర్లు చాలావరకు ఎవరి అదుపాజ్ఞల్లో వున్నాయో అందరికీ తెలుసు.. కానీ, కుక్కిన పేనుల్లా మూసుక్కూర్చున్నారు తప్ప, నిజాలు మాట్లాడే పరిస్థితే లేదు.
అయినా, పవన్ కళ్యాణ్ మీద ‘ప్యాకేజీ’ ఆరోపణలు చేయడమెందుకు.? అధికారంలో వున్నారు కదా.. ఏ విచారణ చేస్తారో చేసేసి, పవన్ కళ్యాణ్ ఫలానా మొత్తం ప్యాకేజీ తీసుకున్నారని కోర్టుల ద్వారా నిరూపించెయ్యొచ్చు. అది చేతకానివాళ్ళే సొల్లుపురాణం చెబుతారు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి. ఇంకా పెద్ద సొల్లు పురాణమేంటంటే, పవన్ కళ్యాణ్ సినిమా రంగానికి భారంగా మారారట. అలాగైతే, పవన్ కళ్యాణ్తో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలెందుకు పోటీపడుతున్నట్టు.?
ఓ మనిషి పొద్దున్న లేస్తే వాడే టూత్ పేస్టు నుంచి సాయంత్రం పడుకునేటప్పుడు టీవీ చూసేవరకూ పన్నులు కడుతున్నాడు, అలా నిండే ఖజానా నుంచి కొందరికి ఓటు బ్యాంకు పథకాలు అందిస్తూ, సొంత పేర్లతో ప్రచారం చేసుకుంటున్నారెందుకు.? అని పవన్ ప్రశ్నించాడు. ఆ సొమ్ముల్ని అడ్డంగా బొక్కేసేవారికి పవన్ కళ్యాణ్ విమర్శలు సొల్లు పురాణంలానే కనిపిస్తాయ్.
పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయినా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.. కానీ, 150 మందికి పైగా ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల్ని గెలుచుకున్న అధికార పార్టీ, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తే.. అది సొల్లు పురాణమట. ఔను, మోచేతి నీళ్ళు తాగడం అలవాటైపోయినోళ్ళకి.. ‘ప్రశ్నించే తత్వం’ తొందరగా మింగుడుపడదు. అందుకే, తమ ‘సొల్లు’ని తమకున్న మీడియా సాధనాల ద్వారా ప్రచారం చేస్తుంటారంతే.