దేశంలో తిరుగులేని మెజార్టీతో వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకున్న భారతీయ జనతా పార్టీ.. క్రమంగా దక్షిణాదిపై తన పట్టు బిగిస్తోంది. ఒకప్పుడు కేవలం ఉత్తర భారతానికి మాత్రమే పరిమితమైన బీజేపీ.. నెమ్మదిగా దక్షిణాదికీ విస్తరిస్తోంది. కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతోంది. ఇందుకు తగ్గట్టుగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోనూ చెప్పుకోతగ్గ సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభావం ఉన్నప్పటికీ.. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మాత్రం ప్రాంతీయ పార్టీలకే సై అన్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందు మోదీ ప్రభావం నిలవలేకపోయింది. అయితే, 2019కి వచ్చేసరికి పరిస్థితి మారింది. అటు బెంగాల్, ఇటు తెలంగాణలోనూ బీజేపీ పాగా వేసింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి 4 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక బెంగాల్ లో అయితే 2 సీట్ల నుంచి ఏకంగా 18 స్థానాలను ఎగబాకింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా తామే ఎదగాలనే తలంపు కమలనాథుల్లో మొగ్గ తొడిగింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ కొడిగడుతున్న నేపథ్యంలో తెలంగాణలో మూడో స్థానంలో ఉన్న తాము.. రెండో స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైతం పుంజుకోవాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే తగిన వ్యూహం రెడీ చేసినట్టు సమాచారం. ముందుగా తెలంగాణలో అధికార పార్టీకి ధీటుగా ఎదిగడానికి 2024లో అధికారం చేజిక్కించుకోవడానికి అవసరమైన ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే కిషన్ రెడ్డికి హోంశాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎంట్రీతో లబ్ధి పొందారు. బాబు వస్తే మళ్లీ ఏమైపోతుందనే భయంతో ప్రజలంతా టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి పరిస్ధితి మారిపోయింది. 16 సీట్లూ గెలుచుకోవాలన్న కేసీఆర్ వ్యూహానికి ప్రజలు చెక్ పెట్టారు. కేవలం 9 స్థానాలు మాత్రమే కట్టబెట్టారు. అనూహ్యంగా బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించడం కమలనాథుల్లో కొత్త ఉత్సాహం నింపింది. దీంతో తెలంగాణలో మరింత బలపడే యోచనతో ముందుకెళ్తున్నారు.
ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను తన వైపు తిప్పుకునే పనికి కాషాయదళం శ్రీకారం చుట్టింది. ఏ పార్టీలోకి వెళ్లకుండా ఉండిపోయిన టీడీపీ నేతలతోపాటు అధికార పార్టీకి చెందినవారిని సైతం ఆకర్షించడం ద్వారా తెలంగాణలో పాతుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలుకానుందని సమాచారం. మరోవైపు ఏపీపైనా కమలనాథుల కన్ను పడింది. అక్కడ అధికారంలోకి వచ్చేంత స్థాయి ప్రస్తుతం లేకపోయినా.. అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే ఆలోచనలు చేస్తోంది.
ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీని నిర్వీర్యం చేయాలన్నది బీజేపీ ప్లాన్ గా చెబుతున్నారు. తద్వారా ఖాళీ అయిన స్థానాన్ని తాము భర్తీ చేయాలన్నది కమలనాథుల వ్యూహం అని అంటున్నారు. అనంతరం కేసులతో జగన్ ను ఇరుకున పెట్టి రాజకీయంగా లాభం పొందే కార్యాచరణను బీజేపీ అమలు చేసే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. మరి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చేయబోయే ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సిందే.
450327 466431Hello to all I cannot realize the strategy to add your web site in my rss reader. Assist me, please 479971