తమిళనాడు డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ కాంత్(71)( Vijaya Kanth) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. బ్రీతింగ్ సమస్యల కారణంగా ఇటీవలే ఆయన ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయనకి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో పరిస్థితి మరింత విషమించి కన్నుమూశారు.
గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి బహిరంగ కార్యక్రమాల్లోనూ, పార్టీ సమావేశాల్లోనూ పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న ఆయనకి గొంతు నొప్పి, దగ్గు, జ్వరం రావడంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటినుంచి పల్మనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. విజయ్ కాంత్ కు భార్య ప్రేమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. నటుడు, నిర్మాత, డైరెక్టర్ గా రాణించారు. అభిమానులు ఆయన్ని ‘పురచి కళింగర్’ పిలుచుకునేవారు. ఆయన నటించిన సినిమాలు దాదాపుగా అన్ని తెలుగులో కూడా డబ్ అవడంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు.