నమస్తే ట్రంప్ పేరుతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కి, భారతదేశం అత్యద్భుతమైన స్వాగతం పలికిన విషయం విదితమే. ఈ స్వాగతాన్ని చూసి అగ్రరాజ్య అధినేత మురిసిపోయిన మాట వాస్తవం. ‘నమస్తే ట్రంప్’ తన జీవితంలో ఓ గొప్ప కార్యక్రమంగా గుర్తుండిపోతుందనీ, అమెరికా ప్రజలు సైతం తమ అధ్యక్షుడికి లభించిన ఈ స్వాగతాన్ని ఎప్పటికీ మర్చిపోలేరనీ అంటున్నారు డోనాల్డ్ ట్రంప్.
అయితే, అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం డోనాల్డ్ ట్రంప్ చేసిన పబ్లిసిటీ స్టంట్కి ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ‘బహుమతి’గా ఈ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని చాలామంది అభివర్ణిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే డోనాల్డ్ ట్రంప్, ఇండియా పర్యటనలో రాజకీయాలూ మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తానన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అమెరికాలో భారతీయుల మద్దతు తనకు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన డోనాల్డ్ ట్రంప్, అమెరికా – భారత్ ఎప్పటికీ మిత్రదేశాలేనని స్పష్టం చేశారు. భారత్ – అమెరికా మధ్య సత్సంబంధాలు ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతూనే వున్నాయి. అయితే, ఇటీవలి కాలంల అవి కాస్త బలోపేతమవుతున్నాయంటే, దానికి బలమైన కారణం ఇరు దేశాల మధ్యా పెరుగుతున్న వాణిజ్య బంధమే. అమెరికా ఆయుధ వ్యవస్థల్ని భారత్కి విక్రయించడం ద్వారా.. ఈ వాణిజ్య బంధం ఎప్పటికప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది.
అయితే, రష్యా నుంచి భారత్ని దూరం చేయడానికే అమెరికా ఈ ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు లేకపోలేదు. భారతదేశంలో అమెరికా ప్రోడక్ట్స్ మీద పన్నులపై ట్రంప్ మొదటి నుంచీ గుర్రుగా వున్నారు. ఇప్పటికీ ఆయనది అదే వాదన. ఇంతకు ముందెన్నడూ ఏ అమెరికా అధ్యక్షుడూ భారత్పై ఈ రకమైన వింత వాదన తెచ్చింది లేదు.
మరోపక్క, అమెరికాలో భారతీయులు సహా, ఇతర దేశస్తులపై ట్రంప్ అసహనం అంతా ఇంతా కాదు. ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో, ఇతర దేశాలకు చెందినవారిని వివిధ అంశాల్లో ట్రంప్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. ఇవన్నీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక భూమిక పోషించనున్నాయి తప్ప.. ‘నమస్తే ట్రంప్’ కారణంగానే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు పూర్తిస్థాయిలో భారతీయులు మద్దతిస్తారని అనుకోలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
736191 665809Enjoyed reading this, very great stuff, thankyou . 979678