ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా చాలా పెద్దది.!
రాజకీయ నాయకుడిపై రాళ్ళ దాడికి సంబంధించి గతంలో పైన పేర్కొన్న నేతలంతా వల్లించిన ప్రవచనాలు, ఇప్పుడు వైసీపీకి శాపంగా మారుతున్నాయి.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రాళ్ళ దాడులు జరిగాయి. ఈ క్రమంలో ఆ రాళ్ళ దాడుల్ని సమర్థిస్తూ చాలామంది వైసీపీ నేతలు చాలా చాలా రకాల వ్యాఖ్యలు చేశారు.
‘మీ పాలనలో విసిగిపోయిన ప్రజలు రాళ్ళతోనో చెప్పులతోనో నిరసన తెలిపి వుంటారు.. అంతే..’ అంటూ సెలవిచ్చారు వైసీపీ నేతలు ఆయా ఘటనల సమయంలో.! అవే వీడియోల్ని ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘రాయి దాడి’కి అన్వయిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.
కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అంటే ఇదే మరి.! ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం వుండకూడదు. దాడి ఎవరి మీద జరిగినా, దాన్ని ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజు జగన్ మీద జరిగితే, దానికి కౌంటర్ ఎటాక్గా ఇంకో రాజకీయ నాయకుడిపైనా దాడి జరిగే అవకాశాలుంటాయ్.
అసలంటూ పోలీసులు సరైన చర్యలు ఆయా ఘటనల్లో తీసుకుని వుంటే, ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యేవి కావు. డీజీపీగా పని చేసిన వ్యక్తి, రాజకీయ నాయకులపై రాళ్ళ దాడుల్ని, భావ ప్రకటనా స్వేచ్ఛగా అభివర్ణించిన సందర్భాలున్నాయి.. అధినేత మెప్పు కోసం పోలీస్ ఉన్నతాధికారులు అలా దిగజారిపోతే ఇదిగో ఇలాంటి పరిస్థితులే వస్తాయ్.!
ఆయా ఘటనల్ని రాజకీయం చేస్తే.. రాజకీయ నాయకులు జనాల్లో తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇది స్వయంకృతాపరాధం.!