కరోనా తో తెలంగాణ సీఎం మృతి చెందారంటూ ఫేస్బుక్లో పోస్టులు రావడం కలకలం రేపింది. దీంతో.. సీఎంపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ సీసీఎస్ సైబర్క్రైం ఠాణాలో కేసు నమోదైంది. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ దీనిపై సోమవారం ఫిర్యాదు చేశారు.
‘కేసీఆర్ కరోనాతో మృతి చెందారంటూ పాన్యాల రాజు అనే అకౌంట్ నుంచి ఫేస్ బుక్ లో పోస్టులు వచ్చాయి. వీటిని ఇతర సోషల్మీడియాలో కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ వార్తలకు రాష్ట్ర ప్రజలు, దేశ, విదేశాల్లోని తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురువుతున్నారు’ అని తన ఫిర్యాదులో శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఏసీపీ ప్రసాద్ నేతృత్వంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా సీఎంపై వచ్చిన తప్పుడు ఫొటోలు, నకిలీ వార్తలను పరిశీలించారు. వెంటనే డిలీట్ చేయాలని ఫేస్బుక్ యాజమాన్యానికి సైబర్క్రైం పోలీసులు నోటీసులు జారీచేశారు. పోస్టులు పెట్టింది ఎవరనేదానిపై ఆధారాలు సేకరించారు. జగిత్యాలకు చెందిన కల్యాణ్ తప్పుడు పోస్టులు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతను ఒక జాతీయ పార్టీ కార్యకర్త అని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం ఇతను దుబాయ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుబాయ్ నుంచే ఈ పోస్టులు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై సైబర్క్రైం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.