పార్టీని గెలిపించే సత్తా వున్న నాయకులంతా ఒకరొకరుగా వైసీపీని వీడుతున్నారు. జగనన్న భజనలో మునిగి తేలుతున్నవాళ్ళేమో, టిక్కెట్టు రాకపోయినా వైసీపీలోనే వుంటామంటూ, అధినేత మెప్పు పొందుతూ, టిక్కెట్లను దక్కించుకుంటున్నారు.
‘పార్టీ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశాం. మా చెప్పుతో మేం కొట్టుకోవాలిప్పుడు..’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిన్న కన్నీటి పర్యంతమవుతూ వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. డజను మంది కాదు, ఆ పైన.. రానున్న రోజుల్లో వైసీపీని వీడబోతున్నారట. వీళ్ళంతా ప్రజా ప్రతినిథులు, పైగా వైసీపీకి సామాజిక వర్గం కోణంలోనూ, ఆర్థిక కోణంలోనూ ఎంతో బలంగా నిలబడినోళ్ళే.!
‘నేనైతే పార్టీ మారను..’ అని చెబుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుుడు అనుచరులతో, స్థానిక పరిస్థితులపై మంతనాలు జరుపుతున్నారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న ఆఫర్ల గురించి ఆరా తీస్తున్నారు, పరిస్థితుల్ని విశ్లేషించుకుంటున్నారు.
అసలేం జరుగుతోంది వైసీపీలో.? అధినాయకత్వాన్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు.? ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. అధినేత వైఎస్ జగన్ ఒకప్పటిలా లేరనీ, తల్లిని దూరం చేసుకోవడం.. చెల్లినీ దూరం చేసుకోవడం.. ఇవేవీ పార్టీకి క్షేమం కాదనీ ఇప్పుడు తీరిగ్గా వాళ్ళంతా బాధపడుతున్నారు.
‘ఇలాగైతే వై నాట్ 175 కాదు.. వై నాట్ సింగిల్ డిజిట్.. అవ్వొచ్చు..’ అన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ. ‘గెలుపు గుర్రాలకే టిక్కెట్లు..’ అంటూ, రాత్రికి రాత్రి ఊరూ పేరూ లేని వ్యక్తుల్ని తెరపైకి తెచ్చి, ఇన్ఛార్జిలుగా ప్రకటించి, టిక్కెట్లు ఇస్తున్న వైనం మరింతగా వైసీపీ శ్రేణుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టిక్కెట్టు ఖాయం చేసుకున్న వైసీపీ ఎంపీ ఒకరు, ఆ పార్టీకి దూరమయ్యే ఆలోచన చేస్తున్నారట. జనసేనతో ఆ ఎంపీ టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. తనతోపాటు మరో ఎంపీని కూడా ఆ నేత జనసేనలోకి తీసుకెళ్ళనున్నారట.
రానున్న రోజుల్లో పెరగబోయే వలసలు, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాబోయే సీట్లను డిసైడ్ చేస్తాయనడం నిస్సందేహం.! మరీ సింగిల్ డిజిట్ అనలేంగానీ, వైసీపీకి గట్టిగా యాభై సీట్లు వస్తే గొప్పేనన్నది తాజా అంచనా.!