దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం అన్నది సర్వసాధారణమైన విషయం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ జరిగిందది. వైఎస్ జగన్ కూడా కాంగ్రెస్, టీడీపీల నుంచే కదా వైసీపీలోకి నాయకుల్ని లాగింది.!
ఇక, దేవుడి స్క్రిప్ట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. నిజమే, 23 మంది ఎమ్మెల్యేలు గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి దూకేసిన దరిమిలా, 2019లో టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే దక్కారన్న వైసీపీ వాదనని కొట్టి పారేయలేం. మరి, అదే దేవుడి స్క్రిప్ట్ 2024లో ఎన్నికల్లో రిపీట్ అయితేనో.?
అంటే, వైసీపీ హయాంలో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూకేశారు. జనసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి దూకిన సంగతి తెలిసిందే. మొత్తంగా అలా దూకిన ఎమ్మెల్యేల సంఖ్య చూసుకుంటే, పది దాటదు. ఆ లెక్కన, 2024 ఎన్నికల్లో వైసీపీకి దేవుడి స్క్రిప్టుని అన్వయిస్తే, సింగిల్ డిజిట్ మాత్రమే రావాలి కదా.?
వైనాట్ 175 అంటోంది వైసీపీ గత కొద్ది రోజులుగా.! అంటే, మొత్తంగా అన్ని సీట్లనూ తామే గెలిచేస్తామనీ, టీడీపీకీ అలాగే జనసేనకీ గుండు సున్నా మాత్రమే మిగులుతుందనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయానా చెబుతున్నారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.!
సింగిల్ డిజిట్ కాదు, వైసీపీకి గుండు సున్నా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది ఇంకో వాదన.! టీడీపీ నుంచీ వైసీపీ నుంచీ జనసేన నుంచీ.. ఈ తరహా వాదనలు వినిపించడంలో వింతేమీ లేదు.
తాజాగా, వెలుగు చూసిన ఓ సర్వే ప్రకారం చూస్తే, వైసీపీ 25 సీట్ల లోపే పరిమితమవుతుందనీ, జనసేన – టీడీపీ కూటమి బంపర్ హిట్ కొట్టబోతోందనీ తెలుస్తోంది.