వైఎస్సార్సీపీకి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుడ్ బై చెప్పేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ‘వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా..’ అని ప్రకటించేశారు ఆర్కే. చిత్రంగా, వైసీపీకి కూడా ఆయన రాజీనామా చేసెయ్యడం గమనార్హం.
‘ఆ వ్యక్తిగత కారణాలేంటి.?’ అని మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే, ‘తర్వాత చెబుతా..’ అంటూ సమాధానం దాట వేశారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఈయన బాటలోనే ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెబుతారా.? అన్నది ఉమ్మడి గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
వాస్తవానికి, ‘ఆళ్ళ రామకృష్ణా రెడ్డి’ అంటే, ఆయన్ని ‘కరకట్ట కమల్ హాసన్’ అని నెటిజనం ముద్దుగా పిలుచుకుంటుంటారు. కారణాలేంటన్నది ఇక్కడ అప్రస్తుతం.! ఆర్కే రాజీనామా వ్యవహారాన్ని వైసీపీ మార్కు డ్రామాగా కొందరు చూస్తున్నారు.
2019 ఎన్నికల్లో అప్పటి మంత్రి నారా లోకేష్ని మంగళగిరిలో ఓడించారు ఆర్కే అలియాస్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి. కానీ, ఈసారి వైసీపీ, మంగళగిరిలో ఓడిపోయే అవకాశం వుండడంతో, ఆర్కేని తప్పించి, గంజి చిరంజీవిని వైసీపీ అధినాయకత్వం తెరపైకి తెస్తోంది.ఈ వ్యవహారం ఆర్కేకి అస్సలు మింగుపడలేదని చెబుతున్నారు.
కారణాలేవైనా, ఇప్పటికే వైసీపీకి ఓ ఎంపీ అలాగే నలుగురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. తాజాగా ఆర్కే దెబ్బతో, మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పినట్లయ్యింది. మరో డజను మంది వరకు ఎమ్మెల్యేలు, ఈ నెలలోనే వైసీపీని వీడతారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నట్టు, విపక్షాలపై.. అందునా, టీడీపీపై.. అందులోనూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై నమోదైన చాలా కేసులకు సంబంధించి, ఆర్కేనే ఫిర్యాదు దారుగా వున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆర్కేని, వైసీపీ ఎందుకు పక్కన పెట్టిందబ్బా.? ‘వాడుకుని వదిలెయ్యడం’ అని దీన్నే అంటారా.?