ఏ సర్వే అయినా చూసుకోండి, వైసీపీదే మళ్ళీ విజయం.. అని చెబుతున్నాయ్.! చాలాకాలంగా వైసీపీ చేసుకుంటున్న ప్రచారమిది. ఓ నేషనల్ మీడియా సంస్థకి ఏకంగా 8 కోట్ల పైన చెల్లించింది వైఎస్ జగన్ సర్కారు.. అదీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకోవడానికి.
ఈ ప్రమోట్ చేసుకోవడం.. అన్న మాటకు అర్థమే లేదు. జనం సొమ్ము కదా.. అడ్డగోలుగా అయినవారికి దోచి పెట్టడంలో ఇదో కొత్త కాన్సెప్ట్ అన్నమాట.! అంత సొమ్ము తిన్నాక, వైసీపీ అనుకూల సర్వేల్ని ఆ మీడియా సంస్థ ఇవ్వకుండా వుంటుందా.?
ఆ ఒక్క సర్వేనే కాదు, చాలా సర్వేల్ని వైసీపీ మేనేజ్ చేస్తూ వచ్చింది. కానీ, ఎన్నికల ముందర సర్వేల ఫలితాలు మారుతున్నాయి. ‘వైనాట్ 175’కి అనుకూలంగా గతంలో వచ్చిన సర్వేల్లో, ఇప్పుడు కాస్త రియాల్టీకి దగ్గరగా అంచనాలు కనిపిస్తున్నాయి.
తాజాగా ఓ సర్వే, వైసీపీ ఓడిపోతుందని పేర్కొంది. అది ఫేక్ సర్వే.. అంటూ, వైసీపీ షరా మామూలుగానే ఎదురుదాడి షురూ చేసింది. తమకు అనుకూలంగా సర్వే ఫలితాలుంటే, వాటిని ప్రచారం చేసుకోవడం.. ప్రతికూల సర్వేలని ఫేక్ సర్వేలనడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదు.
నిజానికి, ఈ తరహా సర్వేల ప్రభావం ఓటర్ల మీద వుండదు. ఓటరు ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు. రాజకీయ పార్టీలు కొన్ని ఓట్లను కొనగలవేమో.. అందర్నీ కొనలేవు కదా.! అలాగన్నమాట.
అయితే, ఇక్కడో పొలిటికల్ కిటుకు దాగి వుంది. సర్వేలు అనుకూలంగా వుంటే, ఆయా రాజకీయ పార్టీల తరఫున, అభ్యర్థుల తరఫున ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కాంట్రాక్టర్లు, ఫైనాన్షియర్లు ముందుకొస్తారు. అది కొంత ఆయా పార్టీల గెలుపుకి సహకరిస్తుంది.
సర్వేల ఫలితాలు తేడాగా వస్తే, ఆర్థిక అండదండలు అందకుండా పోతాయ్. వైసీపీ నుంచి చాలామంది నేతలు ఔట్ అయిపోతుండడానికి కారణం ఈ సర్వేలే.!1 ఇంకొక్క రెండు మూడు సర్వేలు వైసీపీకి వ్యతిరేకంగా వస్తే.. అప్పుడిక గేమ్ పూర్తిగా మారిపోతుంది.
అందుకే, సర్వేలపై వైసీపీ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల రామకృష్ణా రెడ్డి అయితే, మరీ బెంబేలెత్తిపోతున్నారు. ఈ కంగారు వైసీపీలో భయాన్ని స్పష్టంగా బయటపెట్టేస్తోంది.
కొసమెరుపేంటంటే, జనసేన పార్టీ ప్రస్తావన లేకుండా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోలేం.. అని సాక్షాత్తూ నేషనల్ మీడియానే పేర్కొంటోంది. టీడీపీతో కలిసి వెళ్ళాలా? లేదా.? అన్న విషయమై జనసేన అభిప్రాయం తీసుకున్నాకే, బీజేపీ ఓ నిర్ణయానికి వస్తుందనీ నేషనల్ మీడియానే చెబుతోంది.
సహజంగానే, ఇది వైసీపీకి అస్సలు మింగుడుపడదు. జనసేన స్థాయిని తగ్గించేందుకు చంద్రబాబుని ‘యజమాని’గా భావిస్తున్న వైసీపీ, ఇప్పుడు ఆ జనసేన రేంజ్ పెరిగే సరికి, మరింతగా వణికిపోతోంది.