వైసీపీలో ఏదీ శాశ్వతం కాదు.! ఇదీ వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ అలాగే ఆ పార్టీ ముఖ్య నేత.. పైగా ప్రభుత్వ సలహాదారు కూడా అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు సెలవిస్తున్నమాట.!
వై నాట్ 175 అనే నినాదంతో ‘దూసుకుపోతున్న’ వైసీపీ, అనూహ్యంగా, వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల్ని మార్చేస్తోంది. ‘మీరు పెద్దగా కష్టపడాల్సిందేమీ లేదు. మనం ప్రజలకు చాలా మేలు చేసేశాం. చేసిన మేలు చెప్పుకోవడమే..’ అంటూ ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ సహా అనేక పేర్లతో, చిత్ర విచిత్రమైన పబ్లిసిటీ స్టంట్స్ షురూ చేసిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడేమో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో అభ్యర్థుల్ని మార్చుకుంటూ పోతున్నారు.
ఇన్ఛార్జిల మార్పు అంటే, అభ్యర్థుల మార్పే కదా.! ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వికెట్ పడిపోయింది. మరికొన్ని వికెట్లూ పడుతున్నాయి. మొత్తంగా 10కి పైగా వికెట్లు ఇప్పటికే పడిపోయినట్లేనని గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
కాదు కాదు, 60కి పైగా వికెట్లు పడతాయ్.. అంటోంది వైసీపీ అను‘కుల’ మీడియానే.! వికెట్లు పడిపోవడమంటే, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దొరక్కపోవడం.. ఈ క్రమంలో వాళ్ళంతా పార్టీకి దూరమవడం అన్నమాట.!
గొప్ప పరిపాలన అందించేస్తే, ఒక్క ఎమ్మెల్యేని కూడా మార్చకూడదు కదా.? అంటే, పరిపాలన పరమ చెత్త.. అని వైసీపీ పరోక్షంగా తమ ప్రభుత్వానికి తామే రేటింగులు ఇచ్చుకుంటోందని అర్థం చేసుకోవాలన్నమాట.
వైసీపీలో ఏదీ శాశ్వతం కాదు… అన్నదే నిజమనుకుంటే, పార్టీ అధ్యక్షుడికి శాశ్వత పదవి కట్టబెట్టాలని ఎందుకు అనుకున్నట్టు.? ఇంతకీ, 60కి పైగా అభ్యర్థుల మార్పు.. అని సంకేతాలిస్తున్నారు కదా.. ఆ లిస్టులో వైఎస్ జగన్ పేరు కూడా వున్నట్టా.? లేనట్టా.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ కంగారు పడింది.! ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్.. అంతేనా.?