తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైద్రాబాద్లోని యశోదా ఆసుపత్రిలో పరామర్శించిన సంగతి తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా, కేసీయార్ని పరామర్శించారు.
పార్టీలకతీతంగా, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీయార్కి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, కేసీయార్ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఇది ఓ రకంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే వుంటారు, శతృవులు వుండకూడదు. కానీ, రాజకీయమంటేనే శతృత్వం అయిపోయిందిప్పుడు.
అసలు విషయానికొస్తే, కేసీయార్ని చంద్రబాబు పరామర్శించడాన్ని టీడీపీ శ్రేణులు వేరే కోణంలో చూస్తున్నాయి. ‘మాతో పెట్టుకున్నావ్.. అధికారం నీకు దూరమయ్యింది..’ అని చెప్పేందుకే, కేసీయార్ దగ్గరకు చంద్రబాబు వెళ్ళారన్నది టీడీపీలో ఓ సెక్షన్ వేస్తున్న సెటైర్ సారాంశం.
ఇక, కేసీయార్తో జాతీయ రాజకీయాలకు సంబంధించి కలిసి పని చేసే విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఈ ‘పరామర్శను’ ఓ అవకాశంగా మలచుకున్నారంటూ టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదసలు రాజకీయాలు మాట్లాడే సందర్భమా.? చంద్రబాబు ఆ తరహా రాజకీయాలు ఇప్పుడు చేసేలా వున్నారా.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. టీడీపీని వివిధ రాజకీయ పార్టీలు వాడేశాయి. అందులో గులాబీ పార్టీ కూడా ఒకటి. టీడీపీ పోటీ చేయలేదు గనుక, ఆయా పార్టీలకు టీడీపీని వాడుకునే అవకాశం వచ్చింది. అది వేరే వ్యవహారం.
త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్.. ఈ ఎన్నికలకు సంబంధించి కేసీయార్, ఏ రకంగానూ ఏపీ రాజకీయ పార్టీలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇక, జాతీయ రాజకీయాలంటారా.? తెలంగాణ రాజకీయాల్లోనే చేతులెత్తేసిన గులాబీ పార్టీ, జాతీయ రాజకీయాల గురించి ఇప్పట్లో మాట్లాడే అవకాశం దాదాపు లేనట్టే.!