సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ”లక్ష్మీస్ ఎన్టీఆర్”. గత నెల 29న విడుదల అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. మహా నటుడు అన్న నందమూరి తారకరామారావు జీవిత కథలోని లక్ష్మి పార్వతి ఎంట్రీ నేపథ్యంలో జరిగిన కథతో తెరకెక్కిన ఈ సినిమా అంతటా పెద్ద దుమారమే రేపుతోంది.
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి అడుగుపెట్టిన తరవాత జరిగిన పరిణామాలతో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ సందర్బంగా చిత్రంలో కీలక పాత్ర లక్ష్మి పార్వతి గా నటించిన యజ్ఞ శెట్టి మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు…
ఈ సందర్బంగా యజ్ఞా శెట్టి మాట్లాడుతూ .. ఈ సినిమాలో లక్ష్మి పార్వతి పాత్రలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ప్రసుతం ఆ పాత్రకు మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. ఈ పాత్ర గురించి దర్శకుడు వర్మ చెప్పినప్పుడు నాకు లక్ష్మి పార్వతి ఎవరో తెలియదు .. కానీ వర్మ గారు ఆమె గురించి చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను.
ఒక విద్యావేత్త .. ఎం ఫీల్ చదువుకున్న ఆమె భాషా పరిజ్ఞానం ఎలా ఉంటుంది. ఆమె శైలి ఏమిటి ? బాషా తీరు లాంటి అంశాలు పరిశీలించాను. వాటిని జాగ్రత్తగా తెరపై ప్రదర్శించా. ప్రస్తుతం నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ కి వర్మ గారే కారణం. ఆ పాత్ర విషయంలో అయన చెప్పినట్టు చేశాను. నిజంగా నా లైఫ్ టర్నింగ్ పాత్ర ఇదని చెప్పాలి.
ఇదివరకే వర్మ తో వీరప్పన్ చేశాను .. ఆ సినిమాకు కూడా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం నయీమ్ డైరీస్ అనే సినిమా చేస్తున్నాను .. ఇది తెలుగు, కన్నడలో తెరకెక్కుతుంది అని చెప్పింది.