‘నా రాజకీయ జీవితం తెలంగాణతోనే ముడిపడి వుంది..’ అంటూ తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు వైఎస్ షర్మిల. ‘నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం..’ అంటూ అప్పట్లో వైఎస్ షర్మిల చేసిన పొలిటికల్ హంగామా అంతా ఇంతా కాదు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం సుదీర్ఘ పాదయాత్రని ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో షర్మిల చేశారు. వైసీపీ అధికారంలోకి రావడం వెనుక షర్మిల పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కానీ, షర్మిల సేవల్ని వైఎస్ జగన్ గుర్తించలేదు. తన తల్లి విజయమ్మకు పార్టీ గౌరవాధ్యక్షురాలిగా పదవినిచ్చిన వైఎస్ జగన్, షర్మిలను అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు.!
వైఎస్ విజయమ్మ కూడా ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారనుకోండి.. అది వేరే సంగతి. తన కుమార్తె వెంట, తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేయాలనుకున్నారు వైఎస్ విజయమ్మ. అనూహ్యంగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి వైఎస్ షర్మిల పార్టీ తప్పుకుంది. అంతే కాదు, కాంగ్రెస్ పార్టీకి తాము మద్దతిస్తున్నట్లు షర్మిల ప్రకటించారు కూడా.
ప్రస్తుతం వైఎస్సార్ తెలంగాణ పార్టీలో షర్మిల తప్ప ఇంకెవరూ లేరు. అధికారికంగా ఆ పార్టీలో ఎలాంటి సభ్యత్వం విజయమ్మకు లేవు లెండి.! ఇక, ఇప్పుడు షర్మిల తదుపరి రాజకీయ ప్రయాణం ఎటువైపు.? తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిల చేయడానికేమీ లేదు.
త్వరలో కర్నాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందిట. అంటే, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనమైపోతున్నారన్నమాట.. పార్టీతో సహా.! అయితే, ఈ విషయమై అధికారికంగా స్పష్టత రావాల్సి వుంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చాం గనుక, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభావం చూపుతామని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. షర్మిల గనుక, ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయితే, కాంగ్రెస్ బలోపేతమవుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం కూడా భావిస్తోందిట. కానీ, దీనికి వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా.? జగన్ అనుమతి లేకుండా షర్మిల రాజకీయాలు చేస్తున్నారని ఎలా అనుకోగలం.? అన్న వాదనా లేకపోలేదు.