కొన్ని నెలల క్రితం, తన మంత్రి పదవి పోయాక.. వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నోరు జారేశారు.. తమ పార్టీకి సంబంధించి. ‘పని తీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు వుంటాయి.. 60 నుంచి 70 శాతం వరకు ఎమ్మెల్యేల పని తీరు బాగా లేదు. పని తీరు బాగోకపోతే, నాక్కూడా టిక్కెట్ వుండదేమో..’ అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపింది వైసీపీలో.
ఆ తర్వాత కొడాలి నాని తన వ్యాఖ్యలపై బుకాయించారనుకోండి.. అది వేరే సంగతి. ప్రస్తతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు సీట్లు దక్కవన్న విషయమై ఖచ్చితమైన అవగాహనకు వచ్చేయడంతో, వైసీపీలో ఇంకోసారి కలకలం బయల్దేరింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా వ్యవహారంతో, సిట్టింగులు తట్టా బుట్టా సర్దేసుకోవాల్సి వస్తోంది. ఫిబ్రవరిలోనే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్.. అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో.. వైసీపీ నుంచి ముందు ముందు వలసలు కూడా ఇతర పార్టీల్లోకి జోరుగా చూడాల్సి రావొచ్చు.
వైసీపీ నుంచి ఇప్పటికే ఓ ఎంపీ దూరంగా జరిగిపోయారు. ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణారెడ్డి. ఓ నలుగురు ఎమ్మెల్యేలనూ వైసీపీ దూరం చేసుకుంది. ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే, వైసీపీకి దూరమయ్యారు. ముందు ముందు ఈ లిస్టు ఎక్కడిగాకా పెరుగుతుందో ఏమో.!
ఐ-ప్యాక్ నివేదిక ఆధారంగానే సిట్టింగుల్ని పక్కన పెడుతున్నారా.? అంటే, అందులోనూ కొంత నిజం లేకపోలేదు. అసలు విషయమేంటంటే, ఓటమి భయంతో కొందరు నేతలు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. ఆ లిస్టులో పేర్ని నాని తదితరులున్నారు. 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలని గెలుచుకున్న వైసీపీ, ఇప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం ఆశ్చర్యకరమే.
ఓడలు బళ్ళవుతాయి.. అన్నమాటకి ఇప్పుడు వైసీపీ పరిస్థితి నిలువెత్తు నిదర్శనమని అనుకోవచ్చేమో.!