సినీ నటి విజయశాంతి రాజకీయ ప్రయాణం ప్రారంభమయ్యిందే భారతీయ జనతా పార్టీ నుంచి. తిరిగి ఆమె సొంత గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి కూడా. అయితే, విజయశాంతి కోరికల్లో కొన్నిటిని మన్నించే విషయమై బీజేపీ అధిష్టానం మీనమేషాల్లెక్కెడుతుండడంతో ‘కదలిక’ చాలా నెమ్మదిగా సాగుతోంది.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గ్రేటర్ ఎన్నికల్లో విజయశాంతితో ప్రచారం చేయించే దిశగా బీజేపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోందట.. అదే నిజమైతే, నేడో రేపో విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం వుంది. ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కూడా ఖరారయ్యిందనీ, ఢిల్లీలోగానీ.. లేదంటే, హైద్రాబాద్లోగానీ.. ఢిల్లీ స్థాయి నేతల సమక్షంలోనే విజయశాంతి, బీజేపీలో చేరతారనీ తెలుస్తోంది.
అదే సమయంలో బీజేపీలో ఆమెకు కీలక పదవి కూడా దక్కబోతోందట. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ప్రస్తుతానికైతే విజయశాంతి, కాంగ్రెస్ పార్టీని వీడే విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ విజయశాంతి ఇదే తరహా మౌనం పాటించారు.. నిన్న మొన్నటిదాకా అదే మౌనం. నిజానికి, దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనే విజయశాంతిని తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. సహజంగానే విజయశాంతి చూపించే ‘బెట్టు’ ఇక్కడా ఆమె ప్రదర్శిస్తున్నారు. దాంతో, ‘ఆమె అవసరం పార్టీకి ఎంతవరకు.?’ అన్న విషయమై బీజేపీ శ్రేణులూ మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఇదిలా వుంటే, విజయశాంతి చేరికతో బీజేపీకి నష్టమే తప్ప, లాభం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. ఎవరి వాదనలు ఎలా వున్నా, పార్టీ బలోపేతం కోసం ‘గ్లామరనున్న’ నాయకులకు వల వేయడం సహజమే. ఆ కోణంలో బీజేపీ, విజయశాంతిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించబోతోందన్నమాట. విజయశాంతి బీజేపీలో చేరితే, ప్రస్తుతానికి.. అంటే, గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీకి ఒకింత లాభమేనన్నది నిర్వివాదాంశం. అయితే, ఆ తర్వాత విజయశాంతిని బీజేపీ తట్టుకోగలదా.? అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.