ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం.. కానీ, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయం వుండకూడదు. అక్కడ 30 ఏళ్ళపాటు సివిల్ ఆపరేషన్స్ మూసెయ్యాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖను కేంద్ర మంత్రికి సమర్పించారు.. కేంద్ర మంత్రితో ఈ విషయమై మాట్లాడారు కూడా. చంద్రబాబు హయాంలోనే విశాఖ సమీపంలోని భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన విషయం విదితమే.
ప్రతిపాదిత విమానాశ్రయం విజయనగరం జిల్లాలో, విశాఖకు దగ్గరగా ఏర్పాటవుతుంది. ఆ విమానాశ్రయం నిర్మితమైతే, విశాఖ విమానాశ్రయంలో సివిల్ ఆపరేషన్స్ ఎందుకు ఆపేయాలి.? అన్న చర్చ విశాఖ వాసుల్లో బయల్దేరింది. శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణం తర్వాత, బేగంపేట విమానాశ్రయంలో సివిల్ ఆపరేషన్స్ ఆగిపోయిన విషయం విదితమే. అయితే, తెలంగాణలో పరిస్థితులు వేరు.. ఆంధ్రప్రదేశ్లో వేరు.
విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామనే పేరుతో, విశాఖ ఇమేజ్ని దెబ్బతీసేందుకే.. విశాఖ విమానాశ్రయంలో సివిల్ ఆపరేషన్స్ 30 ఏళ్ళపాటు రద్దు చేయాలని కేంద్రాన్ని వైసీపీ కోరుతోందన్న ఆవేదన విశాఖ వాసుల్లో వ్యక్తమవుతోంది. ప్రతిపాదిత బోగాపురం విమానాశ్రయం ఎప్పుడు నిర్మాణం పూర్తి చేసుకుంటుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ప్రస్తుతానికైతే క్లారిటీ లేని పరిస్థితి. ఈలోగా ‘30 ఏళ్ళపాటు విశాఖలో సివిల్ ఆపరేషన్స్ రద్దు’ ప్రతిపాదన ఎందుకు తెరపైకొచ్చినట్లు.?
విశాఖ మీద ‘ఎగ్జిక్యూటివ్’ ప్రేమ చూపుతూనే, విశాఖకు వైసీపీ వెన్నుపోటు పొడుస్తోందా.? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విశాఖ భూముల మీద ప్రేమ తప్ప, విశాఖ అభివృద్ధి పట్ల వైసీపీకి చిత్తశుద్ధి లేదన్న వాదనలపై వైసీపీ ఎలాంటి సమాధానమిస్తుందన్నది వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. ఉమ్మడి రాష్ట్రంలోనూ హైద్రాబాద్ తర్వాత అంతటి ప్రాముఖ్యత వున్న నగరం విశాఖ, ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత కూడా పాలకుల నుంచి నిర్లక్ష్యానికి గురవుతోంది.
Fellow Parliamentarian Sh @VSReddy_MP Ji met me today to discuss setting up of Bhogapuram International Greenfield Airport for public use in Vizianagaram district.@MoCA_GoI @AAI_Official @DGCAIndia @BJP4Andhra @pibvijayawada pic.twitter.com/y15MEP6CbV
— Hardeep Singh Puri (@HardeepSPuri) November 18, 2020