అమెరికా వేదికగా ‘తానా’ సభలు షురూ అయ్యాయి. గత కొంత కాలంగా ‘తానా’పై సవాలక్ష విమర్శలు, వివాదాలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఏడాది మాత్రం, అత్యంత ప్రతిష్టాత్మకంగా తానా సభల్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఈసారి రాజకీయ ప్రముఖుల సందడి కన్పిస్తోంది ‘తానా’లో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ తానా సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
మరోపక్క, తానా సభల కోసం బీజేపీ, టీడీపీ, వైసీపీ సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతుండడం గమనార్హం. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అమెరికాలో తెలుగు అసోసియేషన్లు కులాల ప్రాతిపదికన విడిపోయాయి. ‘తానా’పై ఓ సామాజిక వర్గం పెత్తనం సుస్పష్టం. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి మచ్చ తమ మీద పడకూడదన్న కోణంలో ‘తానా’ టీమ్ నానా తంటాలూ పడుతోంది.
అయితే, ‘తానా’ పేరుతో తెరవెనుకాల రాజకీయం చాలా జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీని ఖాళీ చేసే యత్నాల్లో బిజీగా వున్న బీజేపీ, ఇందుకోసం ‘తానా’ సభల్ని ఓ గొప్ప వేదికగా వాడుకోబోతోందట. టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరైన పయ్యావుల కేశవ్, అమెరికాలో తానా సభలకు హాజరవుతూ తన మిత్రుడు, బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డితో కులాసాగా కన్పించడం గమనార్హం. ‘మేం వచ్చింది అమెరికాకి. ఇక్కడి తెలుగువారి దృష్టిలో తెలుగు ప్రజలంతా ఒక్కటే అన్న భావన కల్పించాల్సిన బాధ్యత మా మీద వుంది. అందుకే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకోం..’ అని పయ్యావుల కేశవ్ చెబితే, ‘ఇది రాజకీయాలకు వేదిక కాదు’ అంటూనే, పయ్యావుల కేశవ్ లాంటోళ్ళు బీజేపీలోకి వస్తామంటే, ఖచ్చితంగా ఆహ్వానిస్తామని విష్ణువర్ధన్రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోపక్క, ‘తానా’ పెద్దలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీ నేతలకు పెద్ద పీట వేస్తున్నారు. అన్నట్టు, బీజేపీ నేతలు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనూ మంతనాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారమ్. అయితే, తానా సభలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఓ అతి ముఖ్యమైన ప్రసంగం మాత్రమే చేస్తారనీ, అంతకు మించి ఆయన ఎవరితోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం లేదని జనసేన వార్గలు అంటున్నాయి.
256888 587149Extremely educating story, saved your web site for hopes to read a lot more! 350069