ఇదీ నిఖార్సయిన షాక్ అంటే.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని నెలల క్రితం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సంచలన ఆరోపణలు చేస్తూ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై చీఫ్ జస్టిస్ బాబ్డే విచారణ చేపట్టారు. జస్టిస్ ఎన్వీ రమణపై వైఎస్ జగన్ చేసిన ఆరోపణల్లో అర్థం లేదని విచారణలో తేలింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో పేర్కొంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ జస్టిస్కి ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. అమరావతిలో జస్టిస్ ఎన్వీ రమణ బంధువులు భూములు కొనుగోలు చేశారనీ, జస్టిస్ ఎన్వీ రమణకి టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నహిత సంబంధాలున్నాయనీ, ఆ కారణంగా రాష్ట్ర పభుత్వానికి ప్రతిసారీ కోర్టుల్లో చుక్కెదురవుతోందనీ, తీర్పులపై ప్రభావం పడుతోందనీ.. ఇలా అధికార వైసీపీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. తన అనుమానాలన్నిటినీ సవివరంగా లేఖలో పేర్కొని, ఆ లేఖను చీఫ్ జస్టిస్కి పంపారు వైఎస్ జగన్.
అయితే, ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. అయితే, విచారణ అత్యంత గోప్యంగా జరిగిందని సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనతో అర్థమవుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలుమార్లు న్యాయస్థానాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. నిజానికి, న్యాయస్థానాల్లో ప్రభుత్వాలకి ఎదురు దెబ్బలు తగలడం కొత్తేమీ కాదు.
తెలంగాణలోనూ న్యాయస్థానాలు ఆయా కేసుల్లో ప్రభుత్వానికి షాక్ ఇవ్వడం చూస్తూనే వున్నాం. ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వం విషయానికొస్తే.. పార్టీ రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఎలా వేస్తారు.? అని కోర్టు ప్రశ్నించినప్పుడు, బాద్యతగల ప్రభుత్వం.. ఆ రంగుల్ని తొలగించాలి కదా.? తొలగించనందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. న్యాయమూర్తులపై అధికార పార్టీ నేతలు నిందారోపణలు చేయడం.. వైసీపీ సోషల్ మీడియా విభాగం జుగుప్సకారమైన రీతిలో న్యాయ వ్యవస్థపై బురద జల్లడం జరుగుతూ వచ్చింది.
ఏదిఏమైనా, రాష్ట్రంలోని అధికార పార్టీ.. వ్యవస్థల మీద బురద చల్లడం మానేసి, పాలనపై దృష్టి పెడితే మంచిది. అన్నట్టు, జస్టిస్ ఎన్వీ రమణ.. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం విదితమే.