సర్వోన్నత న్యాయస్థానం జర్నలిస్టులకు అత్యంత భద్రతను కల్పించేలా కీలక తీర్పుని వెల్లడించింది. జర్నలిస్టులపై దూషణలకు దిగినా, దాడులకు దిగినా.. ఇకపై తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
50 వేల రూపాయల జరీమానాతోపాటు, ఐదేళ్ళ జైలు శిక్ష విధించేలా సర్వోన్నత న్యాయస్థానం ఓ కేసులో తీర్పునిస్తూ, జర్నలిస్టులకు సంపూర్ణ రక్షణ కల్పించింది.
ఇటీవలి కాలంలో మీడియాపై దాడులు ఎక్కువైపోయాయి. అందునా, మీడియాపై రాజకీయ దాడులు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, బహిరంగంగానే మీడియాపై బెదిరింపులకు దిగుతున్నారు. మీడియా అనేది రాజకీయ పార్టీలకు కొమ్ము కాయడంతో.. ఈ విపరీతమైన పరిస్థితి పెరిగిపోయిందన్న వాదనా లేకపోలేదు.
అయితే, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం వుండకూడదు. దురదృష్టవశాత్తూ ఆ ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ లాంటి మీడియాపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, జర్నలిస్టులకు సుప్రీంకోర్టు తీర్పు, శ్రీరామరక్షలా నిలుస్తుందన్నది నిర్వివాదాంశం.
సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది సరే, ఆ తీర్పుల్ని అమలు చేయాల్సింది మళ్ళీ పోలీసు వ్యవస్థే కదా.! ఆ పోలీసు వ్యవస్థపై రాజకీయ పెత్తనాలు పెరిగిపోయాక, అధికార పార్టీల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తున్న దరిమిలా, జర్నలిస్టులకు సుప్రీం తీర్పుతో అయినా రక్షణ లభిస్తుందా.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చనే.!
జర్నలిస్టుల్ని తిట్టడం, కొట్టడమే కాదు.. బెదిరించినా అది నేరంగానే పరిగణింపబడుతుందని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు పట్ల జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.