టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవుల ప్రైవసీకి ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఎక్కడ ఏ స్పై కెమెరా ఉందో, ఎక్కడ ఏ బగ్ పొంచి ఉందో భయపడుతూ బతికే పరిస్థితి. ట్రయల్ రూమ్ లో కీ హోల్ కెమెరాలు ఎలాంటి పరిస్థితి తెచ్చాయో చాలా సంఘటనలు చూశాం. దీంతో అటువంటి వాటిని కనిపెట్టడానికి కొత్తకొత్త పరికరాలు అవసరమయ్యాయి. తాజాగా కరెంటు బల్బులు కూడా ప్రైవసీకి ముప్పు కానున్నాయంటూ చెబుతున్న కొత్త అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది.
ఓ గదిలో మమూలుగా వేలాడదీసి ఉన్న బల్బు సాయంతో అక్కడ మాట్లాడుకుంటున్న సంభాషణలను అప్పటికప్పుడు హ్యాకర్లు వినే అవకాశం ఉందని తేలింది. ఇంతకీ అందులో ఎలాంటి మైక్ లేదా బగ్ ఉండదు. సంభాషణల తరంగాలే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కు చెందిన బెన్ గ్యూరియన్ యూనివర్సిటీ, వీజ్ మేన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కలిసి ఓ ప్రయోగం నిర్వహించాయి.
ఓ గదిలో సాధారణంగా కనిపించే స్మార్ట్ బల్బు ఉంచారు. అనంతరం అక్కడి నుంచి 25 మీటర్ల దూరంలో ఒక టెలిస్కోప్ ఏర్పాటు చేశారు. బల్బు ఉన్న గదిలో ఒక పాట ప్లే చేశారు. ఆ పాట వల్ల వెలువడే తరంగాల కారణంగా బల్బులో వైబ్రేషన్స్ ఏర్పడతాయి. ఈ వైబ్రేషన్స్, వాటి కారణంగా కాంతిలో ఏర్పడే హెచ్చుతగ్గులు కంటికి కనిపించవు. అందుకే శక్తివంతమైన టెలిస్కోప్ వినియోగించి వాటిని రికార్డు చేశారు. దానిని ఆల్గారిమ్ పద్ధతిలో మళ్లీ ధ్వని తరంగాలుగా మార్చి స్పీకర్లకు అనుసంధానించారు. దీంతో స్పీకర్ల నుంచి ఆ గదిలో ప్లే చేసిన పాట వినిపించింది. ఇదంతా ఏకకాలంలో జరిగేలా ఏర్పాట్లు చేయడంతో అక్కడ వస్తున్న పాట ఇక్కడి స్పీకర్లో యథాతథంగా వచ్చింది.
దీంతో బల్బుల సాయంతో కూడా సంభాషణలను హ్యాకింగ్ చేయొచ్చని నిరూపించారు. ఈ విధానానికి ల్యామ్ ఫోన్ అని పేరు పెట్టారు. అంటే ఇకపై గోడలకే కాదు.. బల్బులకూ చెవులుంటాయ్ అని గుర్తుంచుకోవాలన్న మాట. కొత్త ప్రాంతాల్లో రహస్యాలు మాట్లాడుకునేటప్పుడు లైట్లు ఆర్పివేయడం ఉత్తమం.
928540 331083Hey! Great post! Please do tell us when we can see a follow up! 382961