చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో గెలిచిన రోజా ఈ సారి కూడా ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసి బ్యాలెట్ బాక్స్లో ప్రజా తీర్పు నిక్షిప్తమైంది కనుక, కౌంటింగ్ రోజునే ఎవరి జాతకాలు ఏంటో తెలుస్తాయి. మామూలుగా అయితే పోటీ చేసిన అభ్యర్ధులకు గెలుపు, ఓటములపై విపరీతమైన ఆందోళన ఉంటుంది. రోజా ఇందుకు అతీతమేమీ కాదు. కానీ ఆమె ధీమాగా కనిపిస్తున్నారు. కారణమేంటంటే అధికార పార్టీ సర్వేలో కూడా రోజా గెలుస్తారని తేలిందట.
వాస్తవానికి ప్రీ పోల్ అంచనాలు రోజాకి వ్యతిరేకంగా వచ్చాయట. పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ప్రభావం రోజాకి మైనస్గా మారుతుందని కొన్ని విశ్లేషణలు వినిపించాయి. దాంతో అప్పట్లో రోజా కూడా కొంత ఆందోళన చెందారు. తన వాస్తవ వ్యవహార శైలికి భిన్నంగా ఎన్నికల ప్రచారంలో సరికొత్తగా కనిపించారు రోజా. అనవసర రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, ఓటర్లను ఆకట్టుకునేందుకు చాలా హుందాగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్లీన్గా ఎన్నికల ప్రచారంలో అందరి మెప్పునూ పొందిన నేతగా రోజా గురించి అంతా చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, ఎన్నికల కంటే చాలా ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రోజాకి ప్రత్యేకమైన భరోసా ఇచ్చారట. ఆ ప్రత్యేకమైన భరోసా ఏంటంటే మంత్రి పదవి అనీ సమాచారమ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని చాలా గట్టిగా వినిపించడంలో రోజా తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ క్రమంలో అధికార తెలుగు దేశం పార్టీ నుండి ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్క మాటలో చెప్పాలంటే, అధికార పార్టీ వేధింపులకు తీవ్రంగా ఇబ్బంది పడిన వైసీసీ నేతల్లో వైఎస్ జగన్ మొదటి ప్లేస్లో ఉంటే, రెండో ప్లేస్ రోజాదే.
రోజా పట్ల ఉన్న నమ్మకం, పార్టీ కోసం ఆమె పడ్డ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో వైఎస్ జగన్ ఆమెకు మంత్రి పదవిపై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా గెలిచినా, ఓడినా పదవి ఖాయమనే భరోసా ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే, ఓడినా అన్న చర్చకే ఆస్కారం లేదనీ మెజార్టీ గురించి తప్ప ఇంకో ఆలోచనే తమకు లేదనీ రోజా గెలుపుపై వైసీపీ నేతలు అంటున్నారు. గడచిని ఐదేళ్లలో అధికార పార్టీపై రాజకీయ పోరాటం చేస్తూనే, నియోజక వర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం ప్రదర్శించలేదామె.
గతంలోకి తొంగి చూస్తే తెలుగు దేశం పార్టీ హయాంలోనే రోజాకి మంత్రి పదవి దక్కాల్సి ఉంది. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పని చేశారామె. అయితే ఎమ్మెల్యేగా ఆమె గెలవలేకపోయారు. టీడీపీ నేతలే తనకు అడ్డు పడ్డారని అప్పుడూ ఇప్పుడూ ఆరోపిస్తూంటారు రోజా. ఎమ్మెల్సీ పదవిని ఒప్పుకుంటే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అప్పట్లో మభ్యపెట్టారు. కానీ రోజా అందుకు ససేమిరా అన్నారు. ఎలాగైతేనేం ఇన్నేళ్ల కష్టం ఆమెకు సత్ఫలితాన్నిస్తే మంచిదే కదా.