టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుకు సంబంధించి ఆయా పార్టీలో స్వల్పంగా.. అక్కడక్కడా కొంత అసంతృప్తి వుండొచ్చుగాక.! తణుకు నియోజకవర్గం విషయమై జనసేన పార్టీలో అసంతృప్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, టిక్కెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత విడివాడ, సర్దుకుపోయారు.
రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాల్సిన కందుల దుర్గేష్, నిడదవోలుకు వెళ్ళాల్సి రావడంపై జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురైనా, ఆ తర్వాత సర్దుకున్నారు. చెప్పుకుంటూ పోతే, చాలా నియోజకవర్గాలున్నాయి జనసేనకు సంబంధించి.
తెనాలి విషయమై టీడీపీ కూడా తమ కీలక నేతని బుజ్జగించుకుంది. కానీ, పిఠాపురం విషయమై ఎందుకు ఇంత అలజడి రేగినట్టు.? పిఠాపురం నుంచి జనసేనాని పోటీ చేయడం ఖాయమైన దరిమిలా, ఆ నియోజకవర్గంలో అనూహ్యంగా ‘పెంట పెంట’ జరిగిపోయింది.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ మద్దతుదారులమంటూ కొందరు రచ్చకెక్కారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడినీ, నారా లోకేష్నీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్నీ బూతులు తిడుతూ రెచ్చిపోయారు కొందరు మహిళలు. వీళ్ళసలు మహిళలేనా.? అన్న అనుమానం చాలామందికి కలిగింది.
‘పవన్ కళ్యాణ్ గారిని వివాదంలోకి లాగొద్దు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారం..’ అంటూ తన అభిమానులకు వర్మ పిలుపునిచ్చినా, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, గెలుపుని బంగారు పళ్ళెంలో పెట్టి ఇస్తాననీ, పవన్ కళ్యాణ్ ప్రచారానికి కూడా రావాల్సిన అవసరం లేదని అంతకు ముందు వర్మ ప్రకటించారు.
కానీ, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రకటన రాగానే, ట్విట్టర్ వేదికగా వర్మ వేసిన ట్వీట్, అభిమానుల్ని రెచ్చగొట్టేలానే తయారైంది. దీనంతటికీ కారణమెవరు.? టీడీపీ అధినేత చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ముందే ఊహించి, వర్మని ఎందుకు కంట్రోల్లో పెట్టలేకపోయారు.?
మధ్యలో వైసీపీ గూండాలెందుకు ఈ వివాదంలోకి చొచ్చుకు వచ్చినట్లు.? నిజమే, వైసీపీ గూండాలే, కొందరు మహిళలతో ఈ యాగీ చేయించారని టీడీపీ కూడా ఆరోపిస్తోంది. వీడియోల్లో కనిపిస్తున్న మహిళలు కావొచ్చు, కొందరు పురుషులు కావొచ్చు.. వీళ్ళంతా వైసీపీ పెయిడ్ బ్యాచ్ అనే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ పెయిడ్ పెంట సంగతి పక్కన పెడితే, వర్మ కూడా తన అభిమానుల్ని రెచ్చగొట్టారన్నది నిర్వివాదాంశం. పొత్తులో భాగంగా మిత్రపక్షానికి చెందిన అధినేత పోటీ చేసే నియోజకవర్గం విషయంలో టీడీపీ నిర్లక్ష్యం సుస్పష్టం. చంద్రబాబు, వర్మని పిలిచి మాట్లాడించినా.. జనసేన శ్రేణులు, టీడీపీ తీరుని క్షమించే పరిస్థితి కనిపించడంలేదు.