లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత( Kavitha) ను ఈడి అరెస్టు చేసింది. ఈరోజు ఉదయం నుంచి కవిత ఇంట్లో ఈడి సోదాలు నిర్వహించింది.
ఢిల్లీ నుంచి అరెస్టు వారెంట్ తో వచ్చిన పదిమంది అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సుమారు 4 గంటల పాటు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి పలు పత్రాలను, కవిత ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా అధికారులు ఆరా తీశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఇప్పటికే ఈడి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఆమె విచారణకు కూడా హాజరయ్యారు. అంతకుముందు సిబిఐ కూడా ఆమె నివాసంలో సోదాలు చేసి నోటీసులు జారీ చేయగా విచారణకు ఆమె నిరాకరించారు.
అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లో సోదాలు చేశారంటూ కవిత ఇప్పటికే సుప్రీం ని ఆశ్రయించారు. ఈ కేసు కోర్టులో ఉండగా.. తాజాగా ఈడి ఆమెని అరెస్టు చేయడం గమనార్హం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.