మాజీ మంత్రి పేర్ని నానికి ప్రజాధనమంటే ఏంటో తెలీదు.! కష్టార్జితమంటే ఏంటో అసలే తెలియదు.! గతంలో ఆయన రవాణా శాఖ వ్యవహారాలు కూడా చూశారు. వాహనాలకు ఎలాంటి రంగులుంటే, అనుమతిస్తారు.? ఎలాంటి రంగుల్ని అనుమతించరనే విషయం కూడా తెలియదు.
అసలేమీ తెలియదు పేర్ని నానికి.! లేకపోతే, ‘వారాహి’ వాహనం తాలూకు రంగు మీద ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు.? వైసీపీలో అంతే.! పూర్తిగా జ్ఞానాన్ని పక్కన పెట్టేయాల్సి వుంటుంది. అలాగైతేనే, వైసీపీలో వుండగలుగుతారు. ఏమాత్రం జ్ఞానాన్ని ప్రదర్శించినా, వైసీపీలో చోటు కోల్పోతారేమో.!
ఏ రంగు మీద అయితే వైసీపీ అనే పార్టీ, వైసీపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేశాయో, ఆ రంగు వాహనంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద నిరభ్యంతరంగా వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మరెందుకు మంత్రులు కూడా ఆ వాహనం రంగు చెల్లదని రెచ్చిపోయినట్టు.? ముందే చెప్పుకున్నాం కదా, ‘జ్ఞానాన్ని’ పక్కన పెట్టి విమర్శలు చేస్తేనే వైసీపీలో వుండగలుగుతారు.
ఇక, తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్ళి మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడంపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో వచ్చిన ఖర్చు, చేసిన సాయం కంటే ఎక్కువన్నది పేర్ని నాని ఉవాచ.
ఇటీవల విశాఖలో బోట్లు ప్రమాదవశాత్తూ కాలిపోవడంతో రోడ్డునపడ్డ మత్స్యకార కుటుంబాలకు జనసేన అధినేత ఆర్థిక సాయం అందించారు. మొత్తంగా 30 లక్షల వరకు సాయం చేశారు జనసేనాని. తన కష్టార్జితం అలాగే, పార్టీకి వచ్చిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని జనసేనాని ఇచ్చారు.
ఈ విషయమై పేర్ని నాని మండిపడుతూ, ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చెయ్యాలి.. అది బాధ్యత.! ఓ వ్యక్తి, వ్యక్తిగతంగా చేసే సాయం విషయమై విమర్శలు చేయడమేంటి.? పోనీ, పేర్ని నాని ఓ వెయ్యి రూపాయలైనా స్వార్జితం నుంచి సాయం చేశారా.? పోనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ లక్ష రూపాయలైనా ఆర్థిక సాయం వ్యక్తిగతంగా మత్స్యకార కుటుుంబాలకి చేయగలిగారా.?
కష్టార్జితానికీ, ప్రభుత్వం పంచే ప్రజాధనానికి తేడా తెలియని వ్యక్తులు మంత్రులుగా పదవులు వెలగబెట్టారంటే, ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? అందుకే, నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రానికి రాజధాని వున్నా లేనట్టే తయారైంది పరిస్థితి.!