‘యువగళం’ ప్రజల కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర అని జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరిన యాత్ర కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan) వ్యాఖ్యానించారు. ‘యువ గళం’ విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘220 రోజుల పాటు 3000 కిలోమీటర్లకు పైగా 97 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న నాయకుడు లోకేష్. పాదయాత్ర తో ప్రజల కష్టనష్టాలు తెలుసుకునే అవకాశం నాకు రాలేదు. లోకేష్ కి అవకాశం రావడం ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్ర లో పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పటి ప్రభుత్వ పాలన కారణంగా వారంతా వెనకడుగు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని జైలులో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది ఆయన సతీమణి భువనేశ్వరి బాధని దూరం నుంచి అర్థం చేసుకున్నాను. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు సాయంగా నిలబడాలని ఆయనతో ములఖత్ అనంతరం బయటకు వచ్చి పొత్తుపై ప్రకటన చేశాను. 2024లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం మార్పుని తీసుకొస్తాం’
‘ ప్రజలకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి కీడు చేస్తున్నారు. ఎదురు తిరిగితే కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఊహించలేదు. జగన్ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినప్పుడు.. సద్విమర్శలు తీసుకోవాలని సూచించాను. కానీ ఆ వ్యక్తికి ప్రజాస్వామ్యం తెలియదని అర్థమైంది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వైయస్సార్ కూడా ఇంటి ఆడపడుచులను ఎప్పుడు దూషించింది లేదు. వారిని తిట్టే నీచ సంస్కృతి జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరోసారి ఆ ప్రభుత్వం ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. ఎవరికి ఏవి దక్కవు. కొండలు, గుట్టలు కనుమరుగవుతాయి. కాబట్టి గతంలో చెప్పిన విధంగా వైసిపి వ్యతిరేక ఓటుని చీలనివ్వను’.
‘ ఈ పొత్తు సుదీర్ఘకాలం ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుంది. నేను స్నేహానికి గౌరవం ఇస్తాను. వ్యక్తి ప్రయోజనాలు, వర్గ ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి సాటి మనిషిగా మీకు అండగా ఉంటాను. త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తాం. మహిళలకు,యువతకు, రైతులకు అండగా ఉంటాం. పంచాయతీల బలోపేతం, మత్స్యకారుల జీవితంపై దృష్టి సారిస్తాం. వీటన్నింటిపై సమాలోచనలు చేస్తున్నాం’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.