పదీ కాదు, పాతికా కాదు.! ముందుగా అనుకున్నట్టే 60 నుంచి 70 సీట్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ‘టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. పొత్తుకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడొద్దు..’ అని జనసేన పార్టీ శ్రేణులకు సూచించిన జనసేనాని, టీడీపీలో కొందరి నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా, సంయమనం పాటిస్తున్నారు.
‘ముఖ్యమంత్రి అవ్వాలంటే, తగినన్ని సీట్లు గెలవాలి.. ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసేంత సంఖ్యలో సీట్లు గెలవగలిగితే, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడదాం..’ అని పార్టీ శ్రేణులకు జనసేనాని గతంలోనే సూచించారు.
అయితే, జనసేనాని వ్యాఖ్యల్ని వక్రీకరించి టీడీపీ నేతలు, అందునా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ‘అడ్వాంటేజ్’ తీసుకుని, జనసేన శ్రేణుల్ని అవమానపరుస్తున్నారు.. పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారు.
మరోపక్క, జనసేనాని మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 నుంచి 70 సీట్లపై జనసేనాని స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీ ముఖ్య నేతలతోనూ, ఆశావహులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
2024 ఎన్నికలు ఆషామాషీగా వుండబోవనీ, అంగబలం, అర్థబలం ఖచ్చితంగా వుండాలని జనసేనాని, ఆశావహులకు తెగేసి చెబుతున్నారు. సామాజిక అంశాలూ కీలకం కాబోతున్న వైనాన్ని కుండబద్దలుగొడుతున్నారు. ‘బలం వున్న చోట్ల ఖచ్చితంగా పోటీ చేద్దాం. ఈ విషయమై నేనూ చంద్రబాబు కలిసి కూర్చుని వర్కవుట్ చేద్దాం. అవమానకరమైన రీతిలో ఏదీ వుండదు..’ అని పార్టీ శ్రేణులకు సర్ది చెబుతున్నారు పొత్తుల విషయమై.
జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న వేళ, టీడీపీనే తమ శ్రేణుల్ని కంట్రోల్లో పెట్టుకోక తప్పడంలేదు. ఇప్పటికే టీడీపీ నుంచి, ఓ హెచ్చరిక ప్రకటన తెలుగు తమ్ముళ్ళ కోసం వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు పెద్దగా సమయం లేని నేపథ్యంలో, పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే జనసేనాని స్పెషల్ ఫోకస్ పెట్టారు.
కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని జనసేనాని చూచాయిగా ఖరారు చేసేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఉధృతంగా పార్టీ కార్యక్రమాలూ జరుగుతున్నాయి.