విశాఖ తీరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో జీవనాధారం కోల్పోయిన బాధితులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan) అండగా నిలబడ్డారు. ఈ ప్రమాదంలో సుమారు 49 బోట్లు పూర్తిగా దగ్ధం అవ్వగా మరో 10 పైగా పాక్షికంగా కాలిపోయాయి. దీంతో 60 కుటుంబాలకు పైగా జీవనాధారం కోల్పోయారు. వీరికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరో రెండు రోజుల్లో బాధితులను పరామర్శించి ఈ సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్..బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖ తీరంలోని ఫిషింగ్ హార్బర్ లో జీరో జెట్టి వద్ద లంగరు వేసిన బోటు లో మంటలు చెలరేగాయి. క్రమంగా అగ్నికీలలు పక్కనే ఉన్న బోట్లకు అంటుకున్నాయి. గమనించిన మత్స్యకారులు వెంటనే అప్రమత్తమైనప్పటికీ ప్రమాద తీవ్రతను తగ్గించలేకపోయారు. వేట కోసం సిద్ధం చేసి పెట్టుకున్న డీజిల్ క్యాన్లు అక్కడే ఉండటంతో వాటికి మంటలు వ్యాపించి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో రూ.15 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.