Nawaz Sharif: పొరుగు దేశం పాకిస్థాన్ (Pakisthan) ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈదశలో పాకిస్థాన్ వచ్చిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) భారత్-పాకిస్థాన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ కార్యకర్తలతో మాట్లాడుతూ.. ‘మన పతనానికి మనమే కారణం.. భారత్, అమెరికా కాదు. ఆర్ధిక కష్టాలు దేశం కొనితెచ్చుకున్నవే. పొరుగు దేశాలు చంద్రుడిపై అడుగు పెట్టాయి. మనం భూమి మీదే సరిగా ఎదగలేకపోతున్నాం. లేదంటే మనమూ అభివృద్ధి చెందేవాళ్లం’.
‘2018లో మనపై బలవంతపు ప్రభుత్వాన్ని రుద్దారు. ఆర్దిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ప్రజలూ ఇబ్బంది పడ్డారు. సైనిక నియంతలకు న్యాయమూర్తులు అండగా నిలిచారు. మన హయాంలో (2013)లో డిమాండ్ కు తగ్గ విద్యుత్ సరఫరా లేకపోయినా అధిగమించాం. హైవేలు నిర్మించాం. పాకిస్థాన్-చైనా ఎకనమిక్ కారిడార్ తీసుకొచ్చాం. ఆర్దికాభివృద్ధిపరంగా ఎంతో అభివృద్ది చూపాం. తర్వాత కాలంలో అవన్నీ వెనక్కిపోయాయ’ని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మూడుసార్లు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా ఉన్నారు.