ఖతర్నాక్ సినిమాలో రవితేజ నక్షత్ర కావాలి అంటాడు. విలన్ బిజు మీనన్ ‘భూమ్మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం.. నక్షత్రాల్ని ఎలా తెచ్చిస్తాం’ అంటాడు. ఆదివారం రాత్రి కోల్ కతాలో ఉత్తర 24 పరగణాల జిల్లా అశోక్ నగర్ కు చెందిన డొల్లీ ఘోష్ అనే మహిళ చేసిన వీరంగం ఆ సీన్ ను గుర్తు తెస్తోంది.
ఆదివారం రాత్రి ప్రఖ్యాత హౌరా బ్రిడ్జి నాలుగో స్తంభం ఎక్కేస్తోంది ఘోష్. అక్కడి వారు ఆమె ఆత్మహత్య చేసుకుంటుందేమోనని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. ‘కిందకి దిగి రండి.. మీ సమస్య చెప్పండి.. పరిష్కరిస్తాం’ అన్నారు. అందుకామె ‘ఖచ్చితంగా నా సమస్య పరిష్కరిస్తారా’ అని అడిగింది. ఫ్యామిలీ సమస్య అయ్యుంటుంది.. కౌన్సెలింగ్ ఇచ్చేద్దామని ఓకే అన్నారు. కానీ.. ఆమె చెప్పిన విషయం విన్న పోలీసులకు నెత్తిన పిడుగు పడినట్టైంది.
‘నా నోబెల్ బహుమతి నాకు తెచ్చిస్తానంటే దిగివస్తా.. లేదంటే దూకేస్తా’ అని చెప్పింది. షాక్ తిన్న పోలీసులు తేరుకునే లోపే.. ‘అమర్త్యసేన్ కు ఇచ్చిన నోబెల్ బహుమతి నాదే. నా దగ్గర దొంగిలించి ఆయనకిచ్చారు’ అనటంతో పోలీసులు, అక్కడికొచ్చిన ఫైర్ సిబ్బంది ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ‘ఈ విషయంపై నేను కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు లెటర్ రాశాను.. వాళ్లు పట్టించుకోవటం లేదు’ అని మళ్లీ షాక్ ఇచ్చింది.
అప్పుడర్ధమైంది పోలీసులకు. ఆమెకు మతిస్థిమితం లేదని. ఏమాత్రం అజాగ్రత్తగా డీల్ చేసినా ఆమె అక్కడినుంచి దూకేస్తుందని భావించారు పోలీసులు. ‘నోబెల్ తెచ్చే ఏర్పాట్లు చేస్తాం.. మాది పూచీ’ అంటూ ఆమెను నమ్మించి మొత్తానికి కిందికి దిగేలా చేశారు.