తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి ఓటమి పాలవ్వడంతో సీఎం కేసీఆర్( KCR) రాజీనామా అనివార్యమైంది. దీంతో ఆయన తన రాజీనామా లేఖను తన ఓఎస్డి ద్వారా గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కి పంపారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రగతి భవన్ కి వచ్చిన కేసీఆర్ ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో రాజీనామా చేసి రాజభవన్ కి వెళ్లకుండా నేరుగా ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు.
ఈ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేయగా..కామారెడ్డిలో ఓడిపోయి గజ్వేల్ లో గెలుపొందారు. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు ఆయన సీఎం గా కొనసాగారు. సుమారు తొమ్మిదేళ్లపాటు ఆయన ముఖ్యమంత్రిగా సేవలందించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న జరగ్గా ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. 64 స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసుకోగా.. అధికార బీఆర్ఎస్ 29 స్థానాల్లో గెలిచి మరో 10 స్థానాల్లో ఆధిక్యంతో సరిపెట్టుకుంది. బీజేపీ 8 చోట్ల గెలవగా స్వతంత్ర అభ్యర్థులు 8 స్థానాల్లో సత్తా చాటారు.