Jr Ntr: జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) అభిమాని శ్యామ్ (Shyam) అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పు గోదావరి జిల్లా చింతలూరుకు చెందిన శ్యామ్ ఎన్టీఆర్ అభిమాని. ఈనెల 25న తన ఇంట్లో శ్యామ్ అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించాడు. అయితే.. శ్యామ్ మృతి రాజకీయ రంగు పులుముకుంది. శ్యామ్ మృతికి వైసీపీ (YSRCP) నేతలు కొందరు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టంలో శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్టు తేలిందని పోలీసులు తెలిపారు. అయితే.. అతను బ్లేడుతో చేతి మణికట్టు కోసుకున్న ఆధారాలు, జేబులో బ్లేడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శ్యామ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) తోపాటు లోకేశ్ (Lokesh) కూడా స్పందించారు. శ్యామ్ మృతికి వైసీపీ నాయకులే కారణమని పోలీసులు నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఘటనపై ఎన్టీఆర్ స్పందిస్తూ శ్యామ్ మృతికి విచారం వ్యక్తం చేశారు. శ్యామ్ మృతి బాధాకరమని.. తన అభిమాని అనుమానాస్పద మృతి కలచివేస్తోందని అన్నారు. ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఓ ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా శ్యామ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు.
మరోవైపు.. శ్యామ్ మృతికి ప్రేమ విఫలమే కారణమని ప్రాధమిక దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది. మరోవైపు.. శ్యామ్ ది ఆత్మహత్య కాదని.. సమగ్ర విచారణ జరిపి శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ అభిమానులు నినదిస్తున్నారు. #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.