జనసేన పార్టీకి సొంత మీడియా లేదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, జనసైన్యమే జనసేన పార్టీకి ప్రచారాస్త్రం.! పవన్ కళ్యాణ్ అభిమానులే, జనసైనికులు.. ఇందులో దాపరికం ఏముంది.?
నిన్న మొన్నటిదాకా అంటే, కేవలం పవన్ కళ్యాణ్ సినిమా సంబంధిత అంశాల్నే ఎక్కువగా సోషల్ మీడియాలో హైలైట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. పవన్ కళ్యాణ్ సినిమా విశేషాల సంగతెలా వున్నా, రాజకీయాలపై పూర్తి అవగాహనతో వ్యవహరిస్తున్నారు వాళ్ళంతా.
జనసేన పార్టీ తాజాగా, ‘నీకొక్క ఛాన్స్ ఇస్తే’ అనే హ్యాష్ ట్యాగ్తో క్యాంపెయిన్ ప్రారంభించింది. వైసీపీ వైఫల్యాల్ని ఎండగట్టడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. నిన్న సాయంత్రం ప్రారంభమైన ఈ క్యాంపెయిన్.. క్షణాల్లో వైరల్ అయ్యింది.
వందల్లో కాదు, వేలల్లో.. లక్షల్లో ట్వీట్లు పడ్డాయ్. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వున్నాయా.? అని సాధారణ ప్రజానీకం ముక్కున వేలేసుకునేలా, ఆయా సమస్యల్ని ‘నీకొక్క ఛాన్స్ ఇస్తే’ అనే హ్యాష్ ట్యాగ్తో బయటకు తీసింది జనసైన్యం.
‘రాజధాని లేకుండా చేశావ్.. పోలవరం పూర్తి చేయలేకపోయావ్.. ప్రత్యేక హోదా తేలేకపోయావ్.. రైల్వే జోన్ సాధించలేకపోయావ్..’ వంటి కీలక అంశాలతోపాటు, రాష్ట్రంలో మహిళలపై పెరిగిపోయిన అఘాయిత్యాలు, హిందూ దేవాలయాలపై విధ్వంస కాండ.. ఇలాంటి చాలా అంశాల్ని ‘నీకొక్క ఛాన్స్ ఇస్తే’ హ్యాష్ ట్యాగ్తో జనసేన శ్రేణులు ప్రస్తావించాయి.
దురదృష్టమేంటంటే, ఇలాంటి చాలా కీలకమైన అంశాల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేకపోవడం. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ క్యాంపెయిన్కి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ శ్రేణులు సాహసించలేకపోవడం.