‘రెడ్ బుక్’ కాస్తా నారా లోకేష్ని జైలుకు పంపేలా వుంది. అక్రమ కేసులు బనాయించే అధికారులకు సంబంధించి ‘రెడ్ బుక్’లో అన్ని విషయాలూ నమోదు చేస్తున్నట్లు పదే పదే చెబుతున్నారు నారా లోకేష్.
రాజకీయాల్లో ఈ తరహా వ్యాఖ్యలు సర్వసాధారణమే. అయితే, ‘రెడ్ బుక్’ అంటూ కొత్త ప్రస్తావన చేస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.! గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా, అధికారుల మీద అసహనం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అధికారుల్ని బెదిరించిన సందర్భాలూ లేకపోలేదు.
ఇక, అసలు విషయానికొస్తే, నారా లోకేష్ ‘రెడ్ బుక్’ వ్యవహారంపై ఏపీ సీఐడీ, హైకోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అరెస్టు నుంచి నారా లోకేష్ తప్పించుకునేందుకు కోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం, నారా లోకేష్ ఎలాంటి బెదిరింపులకూ దిగకూడదనీ, అయితే లోకేష్ మాత్రం బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఐడీ ఆరోపిస్తోంది.
ఈ ఆరోపణల నేపత్యంలోనే, హైకోర్టుని ఏపీ సీఐడీ ఆశ్రయించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ అరెస్టుకి అనుమతివ్వాలంటూ న్యాయస్థానంలో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్ నేపథ్యంలో సీఐడీకి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిస్తే, ఏ క్షణాన అయినా లోకేష్ అరెస్టయ్యే అవకాశం వుంది.
చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో బెయిల్ మీద బయటకు రావడానికి చంద్రబాబు నానా తంటాలూ పడాల్సి వచ్చింది. లోకేష్ అరెస్టయితే, ఎన్నికల వరకు బయటకు వచ్చే పరిస్థితి వుండకపోవచ్చేమో.!
అయితే, లోకేష్ అరెస్టు విషయమై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. వైసీపీ శ్రేణులు మాత్రం, నారా లోకేష్ ఖేల్ ఖతం.. అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి.