అమెరికాలో భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. ఆ ఓటు బ్యాంకు కోసం అమెరికా అధ్యక్షుడు వెంపర్లాడుతున్నాడా.? ఆ ట్రంప్కి రాజకీయంగా సాయం చేసేందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ‘అత్యుత్సాహం’ చూపిస్తున్నారా.? నిన్న అమెరికాలో మోడీ – ట్రంప్ చేసిన ‘షో’ చూశాక చాలామందికి ఇవే అనుమానాలు కలిగాయి.
రాజకీయ అవసరాలు, పబ్లిసిటీ స్టంట్ల సంగతి పక్కన పెడితే.. భారతదేశానికి అమెరికాలో దక్కిన అరుదైన గౌరవంగా ఈ కార్యక్రమాన్ని అభివర్ణిస్తున్నారు చాలామంది విశ్లేషకులు. అది నిజం కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశానికి అమెరికా మద్దతు చాలా కీలకం. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఒంటరి చేయాలంటే, అది అమెరికాతో భారత్ స్నేహం వల్లనే సాధ్యమవుతోంది. భారత్తో తన అవసరాల రీత్యా, అమెరికా తన మిత్ర దేశమైన పాకిస్తాన్ని దూరంగా పెట్టాల్సి వస్తోంది.
పాకిస్తాన్ పట్ల అమెరికాకి వున్న ప్రేమ ‘ఆయుధ బిజినెస్’ కోసమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆ అవసరాలేవో భారత్ తీర్చేస్తే, అమెరికాకి పాకిస్తాన్తో అవసరమే వుండదు. అయితే, సొంతంగా ఆయుధాల్ని సమకూర్చుకోవడంలో గణనీయంగా ప్రగతి సాధిస్తోన్న భారతదేశం, అమెరికా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసే విషయమై అంతగా ఆసక్తి చూపడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాని ఇంకాస్త అనుకూలంగా మలచుకునే క్రమంలో, అవసరం లేకపోయినా అమెరికా నుంచి భారత్ ఆయుధాల్ని కొనుగోలు చేయాల్సి వచ్చినా ఆశర్యపోనక్కర్లేదు.
మరోపక్క, ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రీ చేయని స్థాయిలో నరేంద్ర మోడీ అమెరికాలో హడావిడి చేస్తుండడం పట్ల సహజంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైన ఈ పరిస్థితుల్లో అమెరికా వేదికగా నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పారన్నది విపక్షాల విమర్శ. ఆ విమర్శల్ని తిప్పి కొట్టడంలో కమలనాథులు తలమునకలై వున్నారు.