మెగాస్టార్ చిరంజీవి విద్యా వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారనీ, చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో ఇప్పటికే విద్యా సంస్థలు స్థాపించారనీ పెద్దయెత్తున ‘రచ్చ’ సినీ, రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న సంగతి తెల్సిందే. విద్య ఎప్పుడో వ్యాపారంగా మారిపోయింది. కార్పొరేట్ విద్యా సంస్థల్ని కొందరు సినీ ప్రముఖులు కూడా రన్ చేస్తున్న మాట వాస్తవం. సినీ నటుడు మోహన్బాబు, ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. అయితే, చిరంజీవి మాత్రం విద్య పేరుతో వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో లేరట. మరి, చిరంజీవి పేరుతో స్కూల్స్ ఎలా వచ్చాయి? అంటే, దాని వెనుకాల పెద్ద కథే వుంది.
చిరంజీవి అభిమాని ఒకరు చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో ఈ విద్యా సంస్థలకి శ్రీకారం చుట్టారు. చిరంజీవి మీద అమితమైన అభిమానంతో ఆయన ఆ స్కూల్స్కి ‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్’ అని పేరు పెట్టడమే కాదు, గౌరవ వ్యవస్థాపకుడిగా చిరంజీవి పేరుని పెట్టుకున్నారు. చిరంజీవితోపాటు నాగబాబు, చరణ్ పేర్లు కూడా ‘గౌరవ’ కోటాలో పెట్టేశాడు. దాంతో, చిరంజీవికి వ్యతిరేకంగా పెద్ద యెత్తున రచ్చ జరుగుతోంది. చిరంజీవి కుటుంబం డబ్బు కోసం కార్పొరేట్ విద్యారంగంలోకి అడుగుపెట్టి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడబోతోందంటూ కొందరు దుష్ప్రచారం అప్పుడే మొదలు పెట్టేశారు.
విషయం కొంత ఆలస్యంగా మెగా కాంపౌండ్కి చేరినా, తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు కన్పిస్తోంది. సదరు సంస్థ గురించి వాకబు చేసి, ఎందుకు ఆ పేరు పెట్టాల్సి వచ్చిందో మెగా కాంపౌండ్ తరఫున ఓ ప్రముఖుడు తెలుసుకున్నారట. జరుగుతున్న దుష్ప్రచారాన్ని సదరు సంస్థ దృష్టికి తీసుకెళ్ళేసరికి, తాను చేసిన ఓ ప్రయత్నం చిరంజీవి ఇమేజ్ని ఇంతలా డ్యామేజ్ చేస్తుందని అనుకోలేదంటూ సదరు అభిమాని, ఆ మెగా ప్రముఖుడితో చెప్పుకుని వాపోయారట. చివరికి, తన తప్పు తెలుసుకున్న ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు.
చిరంజీవికి వున్న లక్షలాది, కోట్లాది అభిమానుల్లో తానూ ఒకడినని, పేద తరగతి విద్యార్థుల కోసం సేవాభావంతోనే ఈ విద్యా సంస్థను స్థాపించడం తప్ప, ఇందులో లాభాపేక్ష అన్న మాటకు తావులేదనీ, ఈ సంస్థతో చిరంజీవికిగానీ, ఆయన కుటుంబ సభ్యులకుగానీ సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు ఆ ప్రెస్ నోట్లో. గౌరవ వ్యవస్థాపకుడంటూ చిరంజీవిని పేర్కొనడం వెనుక ఆయన మీద తనకున్న అభిమానమే కారణం తప్ప, ఇంకో కారణం లేదని, చిరంజీవితో ఈ స్కూల్స్కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ వ్యవస్థాపకుడు, చిరంజీవి అభిమాని అయిన జె. శ్రీనివాసరావు.
అయితే, చిరంజీవిని గౌరవ ఫౌండర్గా, నాగబాబుని అధ్యక్షులుగా, చరణ్ని గౌరవ ఛైర్మన్గా చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ నియమించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేర్లను వాడుకోవడం నూటికి నూరుపాళ్ళూ తప్పిదమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పూర్తి సేవాభావంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ని నిర్వహిస్తున్నా, ఆ సంస్థపై కొందరు పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తూనే వున్నారు. ఈ తరుణంలో అభిమాని అని చెప్పుకుంటోన్న వ్యక్తి, చిరంజీవి విషయంలో ఇంత రిస్క్ ఎందుకు చేసినట్లు?
ఏది ఏమైనా, ఇలాంటి విషయాల్లో చిరంజీవి కుటుంబం ఒకింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే. లేకపోతే, అభిమానుల పేరుతో చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యుల ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతూనే వుంటాయి.