ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా అమరావతిలోని ప్రజా వేదికను వైఎస్ జగన్ సర్కార్ కూల్చివేయడం వెనుక ‘అక్కసు’ సుస్పష్టం. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన హయాంలో ఆ ప్రజా వేదికను ప్రజా అవసరాల కోసం నిర్మించిన విషయం విదితమే. అయితే, ముఖ్యమంత్రి పదవి పోయాక, చంద్రబాబు ఆ ప్రజా వేదికను ప్రతిపక్ష నేతగా ప్రజలతో మమేకమయ్యేందుకు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అందుకు ససేమిరా అనేసిన జగన్ సర్కార్, ఎక్కడ ఆ భవనాన్ని చంద్రబాబుకి ఇవ్వాల్సి వస్తుందోనని రాత్రికి రాత్రి కూల్చేసిన విషయం విదితమే.
కృష్ణా కరకట్టకు దిగువన అక్రమంగా ప్రజా వేదిక నిర్మించారనీ, చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని ఆరోపిస్తూ.. జగన్ సర్కార్ నానా హైరానా పడింది. క్రమక్రమంగా ఆ వేడి చల్లారిందనుకోండి.. అది వేరే విషయం. ఇంత జరిగాక కూడా చంద్రబాబు కృష్ణా నదిని ఆనుకుని నిర్మించిన భవనం నుంచి మాత్రం ఖాళీ చేయలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.
కృష్ణా నదికి వరద పోటెత్తెడంతో చంద్రబాబు కొంప కొల్లేరయ్యే ప్రమాదం ఏర్పడింది. ఎగువ నుంచి వస్తోన్న భారీ వరద నేపథ్యంలో, చంద్రబాబు నివాసం వుంటోన్న ఇంట్లోకి నీరు వచ్చేయనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చంద్రబాబు కుటుంబం అక్కడినుంచి హైద్రాబాద్కి తరలి వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ సిబ్బంది మాత్రమే వున్నారు. వాహనాల్ని అక్కడి నుంచి తరలిస్తున్నారు. మిగతా సామాన్లు కూడా తరలించే అవకాశం వుందంటున్నారు.
అదే గనుక జరిగితే, చంద్రబాబు నివాసంలోకి నీళ్ళు గనుక వచ్చేస్తే.. చంద్రబాబుకి రాజకీయంగానూ ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అదే సమయంలో, తన మాట నిజమవుతున్నందుకు వైఎస్ జగన్ ఫుల్ ఖుషీ అవుతారన్నది నిర్వివాదాంశం. ఎవరి రాజకీయం వారిది.!