తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార పీఠమెక్కుతోంది.
మరోపక్క, ముచ్చటగా మూడోసారి అధికార పీఠమెక్కుదామనుకున్న బీఆర్ఎస్, 39 సీట్లకే పరిమితమై, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోంది. అయితే, ఇది జస్ట్ చిన్న ‘హనీమూన్’ లాంటిదేననీ, వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతామనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెలవిచ్చారు.
మరో బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి అయితే, బీజేపీ, మజ్లిస్ పార్టీలను కలుపుకుంటే, 50కి పైగా సీట్లు తమకు వుంటాయనీ, కాంగ్రెస్లో అంతర్గత కల్లోలాల నేపథ్యంలో, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదనీ అంటున్నారు.
శుభం పలకరా అంటే.. డాష్ డాష్ అన్నాడట వెనకటికి ఒకడు. అలా తయారైంది వ్యవహారం. కాంగ్రెస్ పార్టీని గతంలో టీఆర్ఎస్ చాలా దారుణంగా దెబ్బకొట్టింది. అది గతం. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గనుక సీరియస్గా తీసుకుంటే లెక్కలు మారిపోతాయ్.
జస్ట్ నెల రోజుల్లో, గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసెయ్యగల స్థాయిలో రేవంత్ రెడ్డి తన ‘పవర్’ని పెంచుకోగలరన్నది బహిరంగ రహస్యం. కేటీయార్ వ్యాఖ్యల సంగతెలా వున్నా, కడియం శ్రీహరి వ్యాఖ్యలు చూస్తోంటే, కేసీయార్ని రాజకీయంగా దెబ్బకొట్టే లక్ష్యంతోనే ఆ వ్యాఖ్యలున్నాయని అర్థం చేసుకోవాల్సి వస్తుందేమో.
ప్రత్యర్థి పార్టీల్ని రాజకీయంగా దెబ్బ కొట్టడం కేసీయార్కి వెన్నతో పెట్టిన విద్య. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. అన్నిటికీ మించి, ‘తెలంగాణ సెంటిమెంట్’ ఇప్పుడు పని చేయడంలేదు. సమీప భవిష్యత్తులో కొత్తగా పని చేయడానికీ ఏమీ వుండదు.!