లైంగిక వేధింపుల విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు తీవ్రంగా చర్చనీయాంశమైంది. లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించడానికి ఉద్దేశించిన పోక్సో చట్టం ప్రకారం.. దుస్తులపైనుంచి బాలికల శరీర భాగాలను తాకితే తప్పు కాదని పేర్కొంది. ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే చెబుతోందని వ్యాఖ్యానించింది. బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని స్పష్టంచేసింది.
12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో విచారణ సందర్భంగా నాగ్పుర్ బెంచ్కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా ఈమేరకు తీర్పునిచ్చారు. ఆ కేసులో నిందితుడికి పోక్సో చట్టం కింద విధించిన మూడేళ్ల జైలు శిక్షను కొట్టివేశారు. అయితే, ఐపీసీ సెక్షన్ 354(ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్ 342(దురుద్దేశంతో నిర్బంధించడం) కింద దిగువ కోర్టు విధించిన ఏడాది కఠిన కారాగార శిక్షను మాత్రం సమర్థించారు.
2016లో సతీష్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో ఉండే 12 ఏళ్ల బాలికకు పండు ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె వక్షస్థలాన్ని తాకి దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. ఈ పరిణామానికి నిశ్చేష్టురాలైన బాలిక.. గట్టిగా కేకలు వేయడంతో వెంటనే ఆమె తల్లి పరిగెట్టుకుని వచ్చింది. అనంతరం నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం కేసు విచారించిన దిగువ కోర్టు పోక్సో చట్టం కింద మూడేళ్లు, ఐపీసీ కింద ఏడాది శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పు వెలువరించింది.