Janasena: రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన (Janasena) పార్టీని ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఈక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల నుంచి కూడా పవన్ కు గట్టి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పార్టీకి అనేక రూపాల్లో జనసైనికులు, అభిమానులు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా (australia) లోని ఎన్ఆర్ఐ సభ్యులు జనసేనకు భారీ విరాళం అందించారు. రూ.కోటి విరాళం అందించి పార్టీ బలోపేతానికి తమ వంతు సాయం అందించారు.
ఈమేరకు పార్టీ ఓ ప్రకటనలో.. ‘నా సేన కోసం నా.. వంతు’ కార్యక్రమంలో భాగంగా ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ సభ్యులు రూ.కోటి సేకరించి విరాళంగా చెక్కు రూపంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు అందజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ సమన్వయకర్తలు రాజేశ్ మల్లా, శశిధర్ కొలికొండ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగదీశ్ హరిదాస్, జ్ఞానేశ్వర్ రావ్ పప్పుల, చందు గల్లా పాల్గొన్నార’ని వివరాలు వెల్లడించింది.