కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది దశ పోలింగ్ నేటితో ముగియనుంది. పోలింగ్ సమయం అధికారికంగా ముగిసే సమయం తర్వాత.. అంటే, ఐదున్నర.. ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడవుతాయి.
ప్రతిసారీ ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాల్ని వెల్లడిస్తూ వుంటాయి. గత కొంతకాలంగా ఈ ఎగ్జిట్ పోల్ అంచనాలు.. లెక్కలు తప్పుతున్నాయి. ఇవి కూడా అమ్ముడుపోతున్నాయన్న విమర్శలున్నాయి.
ఓటరు తన అభిప్రాయాన్ని ఈవీఎంలో నమోదు చేశాక, ఎగ్జిట్ పోల్ అంచనాలు అమ్ముడుపోవడం వల్ల ఉపయోగమెవరికి.? అంటే, బెట్టింగులు నిర్వహించేవారికన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, ఓటమి భయంతో కౌంటింగ్ కేంద్రాలకి ఏజెంట్లు వెళ్ళలేని పరిస్థితి ఏ రాజకీయ పార్టీ మాత్రం కోరుకుంటుంది.?
సరే, అవన్నీ పక్కన పెడితే, ఏ ఎగ్జిట్ పోల్ ఎలాంటి అంచనాలు వెల్లడించనుందన్నదానిపై సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రకరకాల నెంబర్లు సర్క్యులేట్ అవుతున్నాయి. నిజానికి, వీటిల్లో కొన్ని ఫేక్ నెంబర్స్.. కొన్ని లీక్డ్ నెంబర్స్.!
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎక్కువగా ఫేక్ నెంబర్స్ చెలామణీలోకి వస్తున్నాయి. కొన్ని లీక్డ్ నెంబర్లు కూడా చూస్తున్నాం. ఫలానా సంస్థ ఫలానా విధంగా అంచనాలు వెల్లడించనుందంటూ ఎగ్జిట్ పోల్ అంచనాలపై ట్విట్టర్ స్పేసుల్లో ముచ్చట్లూ షురూ అయ్యాయి.
వీటి ఆధారంగా కొందరు బెట్టింగులకు దిగుతున్నారు. లక్షల్లో కాదు, కోట్లల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగులు, ఎగ్జిట్ పోల్ అంచనాల తర్వాత మరింత పెరగనున్నాయన్నది నిర్వివాదాంశం. లక్షకి ఐదు లక్షలు, పది లక్షల వరకు.. బెట్టింగులు వెళుతున్నాయ్.