2024 ఎన్నికలకు సంబంధించి తెలుగు దేశం పార్టీ, తన మిత్ర పక్షం జన సేనకు ముందే రాజకీయంగా వెన్ను పోటు పొడిచేలా వుంది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు టీడీపీలో చేరుతూనే, ‘150 సీట్లను టీడీపీ గెలుస్తుంది.. పాతిక సీట్లు వాళ్ళకు వదిలేస్తాం..’ అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కోణమేంటి.?
వాళ్ళకు అంటే ఎవరికి.? వైసీపీకా.? లేదంటే, మిత్రపక్షం జనసేనకా.? ఈ విషయమై టీడీపీకే స్పష్టత లేదు. కానీ, దాడి వీరభద్రరావు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసేశారు.
అంటే, జన సేనతో పొత్తు అవసరం లేదన్న భావనతో టీడీపీ వున్నట్లే భావించాలేమో. టీడీపీ సోషల్ మీడియా అంటే, నారా లోకేష్ పనే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. లోకేష్ తన కనుసైగతో టీడీపీ సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తుంటారు.
కష్ట కాలంలో చంద్రబాబుకి అండగా నిలబడింది లోకేష్ కాదు, ఇంకో టీడీపీ ముఖ్య నేత కూడా కాదు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ కంటే బాధ్యతగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన విషయాన్ని టీడీపీ శ్రేణులూ గుర్తించాయ్.
కానీ, ఆ కృతజ్ఞతా భావం టీడీపీలో ఇప్పుడు కనిపించడంలేదు. లేకపోతే, జన సేన మీద వెన్ను పోటు రాజకీయాలేంటి.? జనసేన పార్టీకి పాతిక సీట్లు మాత్రమేనంటూ టీడీపీ నుంచి సంకేతాలు రావడమేంటి.?
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీడీపీకి 2024 ఎన్నికలు జీవన్మరణ సమస్య. గెలిస్తే, టీడీపీకి మనుగడ. ఓడితే అంతే సంగతులు. టీడీపీ గెలుపోటముల్ని జనసేన పొత్తు మాత్రమే డిసైడ్ చేస్తుంది. జనసేన – టీడీపీ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా సాగితేనే, పొత్తు వల్ల ఇరువురికీ లాభం. అందునా, టీడీపీకి మరీ లాభం.
లేని పక్షంలో.. టీడీపీకి జరగబోయే నష్టం అంచనాలకు మించి వుంటుంది. అదే గనుక జరిగితే, జనసేనకు వెన్నుపోటు పొడవడం ద్వారా టీడీపీ తన భస్మాసుర హస్తాన్ని తన నెత్తి మీదనే పెట్టుకున్నట్లవుతుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ, టీడీపీ నుంచి ఇలాంటి పిల్ల చేష్టల్ని అస్సలు సహించలేకపోతోంది జనసేన పార్టీ. అయితే, పొత్తు ధర్మానికి కట్టుబడి జనసేన శ్రేణులు సంయమనం పాటిస్తున్నాయి. కానీ, టీడీపీ ఇదే ధోరణి కొనసాగిస్తే.. జనసేన తన దారి తాను చూసుకోక తప్పదేమో.!
పార్టీల్లో చేరికలు ఏ పార్టీకైనా కొత్త ఉత్సాహాన్నిస్తాయి. జనసేనలోనూ చేరికలుంటున్నాయి. కానీ, అలా జనసేనలో చేరుతున్నవాళ్ళెవరూ ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయడంలేదు. ఒకవేళ ఎవరైనా మాట దాటినా, డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడుతోంది జనసేన.
జనసేనకి చెందిన ఓ నేత, ఇటీవల అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలకుగాను షోకాజ్ నోటీసులు అధినాయకత్వం నుంచి అందుకున్నారు. కానీ, టీడీపీ ఏం చేస్తోంది.? పొత్తుకు నష్టం కలిగించేలా కొందరు చేస్తున్న వ్యాఖ్యల్ని సమర్థిస్తోంది. చంద్రబాబుకి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయని అనుకోలేం. కాకపోతే, నారా లోకేష్ని చంద్రబాబు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని అనుకోవాలేమో.!