తెలిసే అంటున్నారో.. తెలియక అంటున్నారోగానీ, ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి వచ్చే మాటలు, వైసీపీని నిండా ముంచేస్తున్నాయి.! మొన్నటికి మొన్న సీపీఎస్ రద్దు విషయమై, ‘అవగాహన లేక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ అది. సీపీఎస్ రద్దు కుదరదు.?’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దాంతో, ఉద్యోగుల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. పూర్తి మెజార్టీతో వైసీపీ అధికారంలో వుంది గనుక, ఉద్యోగస్తులు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నికల వేళ వైసీపీకి, మొదటి షాక్ తగిలేది ఉద్యోగులు, వారి కుటుంబాల నుంచే.
ఇక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం తర్వాత, ‘మా ఓటర్లు వేరే వున్నారు’ అని సజ్జల చేసిన వ్యాఖ్యలూ వైసీపీకి చాలా చాలా మైనస్ అయ్యాయి. సకల శాఖల మంత్రి.. అనే ట్యాగ్ కలిగి వున్న సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల వైసీపీకి ఏంటి లాభం.? అన్నది వైసీపీ అధినాయకత్వానికే తెలియాలి.
తాజాగా, మద్య నిషేధంపై తేలిక వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ‘మద్య నిషేధం అన్నది ఓ డ్రీమ్ లాంటిది..’ అనేశారు సజ్జల. అంటే, ఐదేళ్ళు వైసీపీ సర్కారు నిద్రపోయినట్టే కదా.? నిద్రలో వున్నప్పుడే కలలు వస్తాయ్.!
మద్య నిషేధం లాంటి సీరియస్ అంశం మీద, సజ్జల రామకృష్ణారెడ్డి ‘డ్రీమ్’ అంటూ కామెడీ చేయడం ఏదైతే వుందో, అది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంత బాధ్యతారాహిత్యమా.? ఆయన కేవలం వైసీపీ నేత కాదు, గౌరవ సహాదారుగా ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా అందుకుంటున్న బాధ్యతగల వ్యక్తి.. అన్న చర్చ అంతటా జరుగుతోంది.
ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా అందుకుంటున్నప్పుడు, ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి.? మద్యం అనేక రకాలుగా ప్రజల ప్రాణాల్ని తీస్తోంది. మద్యం సేవించినోళ్ళ ఆరోగ్యం పాడైపోవడం అన్నది ఓ కోణం మాత్రమే. ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మద్యం తాగి అఘాయిత్యాలకు పాల్పడినవారివల్ల ఎన్నో జీవితాలు నాశనమైపోతున్నాయ్.
ఇంత తీవ్రమైన అంశాన్ని పట్టుకుని ‘కల’ అంటారేంటి సజ్జల.?